
నల్గొండ, వెలుగు : తల తాకట్టు పెటైనా వచ్చే మూడున్నరేండ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి తీరుతామని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాలశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం నల్గొండ జిల్లా నకిరేకల్ లోని మినీ స్టేడియంలో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీ చేశారు. సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అర్హులైన ప్రతిఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తామన్నారు.
పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను వారం రోజుల్లో కంప్యూటరైజ్ చేసి సమస్యలన్నీ ఆగస్టు 15లోపు పరిష్కరిస్తామన్నారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం కోరిక మేరకు వారం రోజుల్లో రామన్నపేట, నకిరేకల్ తహసీల్దార్ కార్యాలయాలకు నూతన భవనాలను మంజూరు చేస్తామన్నారు.
అర్హులైన ప్రతిఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు..
రాష్ట్రంలో అర్హులైన ప్రతిఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు వస్తాయని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ధరణి స్థానంలో భూభారతి తెచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని సూచించారు. ప్రజాప్రతినిధులు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. సన్నబియ్యం, రైతు భరోసా, రైతుబీమా వంటి పథకాలపై ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు.
భూసమస్యలను తొలగించేందుకే భూభారతి..
భూభారతి సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిందని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఆగస్టు 15లోపు సమస్యలను పరిష్కరిస్తామని వెల్లడించారు. పారదర్శకంగా ఇందిరమ్మ ఇండ్ల జాబితా తయారు చేశామని, ఇందులో ఎలాంటి రాజకీయ జోక్యం లేదన్నారు. ఇండ్లు వచ్చిన లబ్ధిదారులు 30 రోజుల్లో పనులు మొదలు పెట్టాలని సూచించారు. 4 విడతల్లో ఇందిరమ్మ ఇండ్ల బిల్లులు చెల్లిస్తామని తెలిపారు.
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ రామన్నపేట, నకిరేకల్ మండలాలకు తహసీల్దార్ కార్యాలయాలకు నూతన భవనాలు మంజూరు చేయాలని మంత్రిని కోరారు. కట్టంగూర్ లో ప్రభుత్వ భూమి సమస్యను పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్సీలు శంకర్ నాయక్, నెల్లికంటి సత్యం, ఎమ్మెల్యేలు బత్తుల లక్ష్మారెడ్డి, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, మందుల సామేల్, యాదాద్రి కలెక్టర్ హనుమంతరావు , శాసనమండలి మాజీ చైర్మన్ నేతి విద్యాసాగర్, అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.