బాధితులకు ఇండ్లు నిర్మించి ఇస్తాం : పొన్నం ప్రభాకర్

 బాధితులకు ఇండ్లు నిర్మించి ఇస్తాం : పొన్నం ప్రభాకర్

కరీంనగర్​: అగ్ని ప్రమాదంలో సర్వస్వం కోల్పోయిన బాధిత కుటుంబాలను ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని  మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. కరీంనగర్ ఆదర్శనగర్ లో నిన్న అగ్ని ప్రమాదంలో దాదాపు 21 పూరి గుడిసెలు దగ్ధమయ్యాయి. ఇవాళ ఉదయం ఘటన స్థలాన్ని మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా బాధితులతో మాట్లాడి ప్రమాదం జరిగిన తీరు, నష్టం వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగావిలేకరులతో మాట్లాడుతూ ప్రమాదంలో నష్టపోయిన వారంతా నిరుపేదలేనని అన్నారు. 

వీరికి తాత్కాలికంగా భోజన వసతి, నివాసం ఉండేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. ప్రభుత్వం, పార్టీ తరఫున కూడా వారికి సామగ్రి అందిస్తామని చెప్పారు. కొద్ది రోజుల్లో వారికి  రాజీవ్ స్వగృహతో పాటు వేరే చోట వారు నివాసం ఉండేలా చూసి శాశ్వతంగా  గృహ వసతి కల్పిస్తామని పేర్కొన్నారు. బాధితులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని కలెక్టర్ తో పాటు జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించామని తెలిపారు నియోజకవర్గంలో  3,500 నుంచి 4,000 ఇల్లు నిర్మించి ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఇందులో అగ్ని ప్రమాద బాధితులకు మొదటి ప్రాధాన్యతలో ఇల్లు నిర్మించి ఇస్తామని తెలిపారు. 

పూరి గుడిసెలతో పాటు ఇల్లు లేని పేదవారికి ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇస్తామని తెలిపారు.  కబ్జాకు గురైన  ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకొని పేదలకు అందించేందుకు కృషి చేస్తామన్నారు. జిల్లా ఇన్ చార్జి మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి త్వరలో జిల్లాలో పర్యటించనున్నారని, ఈ మేరకు అన్ని సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని చెప్పారు.