పెట్రోల్, డీజిల్ రేట్లు త్వరలో తగ్గుతయ్

పెట్రోల్, డీజిల్ రేట్లు త్వరలో తగ్గుతయ్

న్యూఢిల్లీ: దేశంలో రోజురోజుకీ పెట్రో ధరలు పెరుగుతున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ ధర వంద మార్కును దాటగా.. మరికొన్ని స్టేట్స్‌‌లో సెంచరీకి చేరువలో ఉంది. ఈ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలంటూ విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. ఈ విషయంపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందించారు. అంతర్జాతీయ మార్కెట్‌‌లో అస్థిరత వల్లే పెట్రో రేట్లు పెరుగుతున్నాయని స్పష్టం చేశారు. ‘ఇంటర్నేషనల్ మార్కెట్లలో క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతుండటంతో వినియోగదారులకు అమ్మకం రేట్ కూడా ఎక్కువైంది. అయితే ఇది మెళ్లిగా తగ్గుతుంది. ధరలు పెరగడం తాత్కాలికమే. కరోనా వల్ల గ్లోబల్‌‌గా చమురు ఉత్పత్తి బాగా తగ్గింది. ఇది కూడా ధరల పెరుగుదలకు ఓ కారణమే. పెట్రోలియం ప్రాడక్ట్స్‌‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని జీఎస్టీ కౌన్సిల్‌‌ను కోరాం. కానీ దీనిపై వాళ్లు ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదు’ అని ప్రధాన్ చెప్పారు.