ఆదిలాబాద్ జిల్లాకు పొరుగున ఉన్న చంద్రాపూర్ జిల్లాలో దారుణ ఘటన జరిగింది. నిన్న రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందిన ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. కరెంటు లేని సమయంలో కుటుంబ సభ్యులంతా జనరేటర్ వేసుకుని పడుకున్నారు. అయితే తెల్లారిన తర్వాత వారిలో ఏ ఒక్కరూ లేవలేదు. అందరూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. జనరేటర్ నుండి విషవాయువులు వెలువడటం వల్లే మృతి చెందినట్లు ప్రాథమిక నిర్దారణ అయింది.
చంద్రాపూర్ జిల్లా కేంద్రంలోని దుర్గాపూర్ ప్రాంతంలో నివసిస్తున్న రమేష్ లష్కర్ (50) సివిల్ కాంట్రాక్టర్. ఈయన ఇంటిలో నిన్న రాత్రి ఇంట్లో జరిగిన ఈ ప్రమాదం కలకలం రేపింది. కేవలం 10 రోజుల క్రితమే ఇంట్లో పెళ్లి వేడుకలు జరిగాయి. ఆ ఆనంద స్మృతుల ఛాయలు ఇంకా ఆ కుటుంబంలో కనిపిస్తూనే ఉన్నాయి. ఇంతలోనే ఊహించని రీతిలో నిన్న రాత్రి అందరూ చనిపోయారు. పవర్ కట్ కావడంతో జనరేటర్ ఆన్ చేసుకుని నిద్రపోయారు. జనరేటర్ నుంచి విడుదలైన విషవాయువుల కారణంగా వారంతా ప్రాణాలు కోల్పోయారు. మృతులను రమేష్ (50), అజయ్(21), లఖన్(10), కృష్ణా(8), పూజా(14), మాధురి(20)గా గుర్తించారు.