వర్షాలు పడొద్దని  హరీశ్ తాంత్రిక పూజలు..విప్ అద్దంకి దయాకర్ ఆరోపణ

వర్షాలు పడొద్దని  హరీశ్ తాంత్రిక పూజలు..విప్ అద్దంకి దయాకర్ ఆరోపణ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వర్షాలు పడొద్దని హరీశ్ తాంత్రిక పూజలు చేయించాడని విప్ అద్దంకి దయాకర్ సంచలన ఆరోపణలు చేశారు. శుక్రవారం ఆయన హైదరాబాద్​లో మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. తాంత్రిక పూజలకు ప్రసిద్ధి చెందిన శివమొగ్గ( శిమోగా ), తిరుచ్చిలోని జై అఘోర కాళీ ఆలయంలో హరీశ్ పూజలు  చేయించినట్లు  సమాచారం ఉందన్నారు. ఇది దేనికి సంకేతం అని ప్రశ్నించారు.

తెలంగాణలో వర్షాలు పడొద్దని, ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో వ్యతిరేకత పెరగాలని హరీశ్​ ఈ క్షుద్ర పూజలు చేయించాడని ఆరోపించారు. రాష్ట్రంలో కరువు రావాలన్నదే బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ నేతల ఉద్దేశమని ఫైర్ అయ్యారు. అధికారం లేకపోతే అఘోరాలుగా తయారవడం ఏంటని ఫైర్​అయ్యారు. అధికారం కోసం ఇంతలా దిగజారడం సరికాదన్నారు. కేసీఆర్ ఆదేశాలతో ఈ పూజలను హరీశ్​రావు చేయించాడా.. లేదంటే ఆయనే సొంతగా తీసుకున్న నిర్ణయమా స్పష్టం చేయాలని డిమాండ్ ​చేశారు.