
- గత పదేండ్లలో ఇష్టారాజ్యంగా వనరుల దుర్వినియోగం
- ప్రజాదర్బార్లు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతాయని వెల్లడి
మధిర, వెలుగు : రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై శ్వేతపత్రం సిద్ధం చేస్తున్నామని, త్వరలోనే విడుదల చేస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. 2014కు ముందున్న ఆర్థిక పరిస్థితులు, 2023 వరకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న ఆర్థిక పరిస్థితులపై సరైన సమయంలో సరైన వేదికపై వైట్పేపర్రిలీజ్చేస్తామని వెల్లడించారు. సోమవారం ఖమ్మం జిల్లా మధిరలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం కోసం కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజల ఆకాంక్షలు నెరవేరకపోగా, ఉన్న స్వేచ్ఛను సైతం హరించారని భట్టి విమర్శించారు.
గత పదేండ్లలో అస్తవ్యస్తమైన పాలనతో వనరుల దుర్వినియోగం, సంపద దోపిడీ, సంస్థలు, వ్యవస్థలు విచ్ఛిన్నమయ్యాయన్నారు. వ్యవస్థీకృతమైన సమాజాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం దెబ్బతిసిందనీ, ఆర్థిక అసమానతలు గల ఫ్యూడల్ సమాజాన్ని నిర్మించిందని డిప్యూటీ సీఎం ఆరోపించారు. రాష్ట్ర చీఫ్ సెక్రటరీ, డీజీపీ మొదలుకొని గ్రామస్థాయి అధికారి వరకు ప్రజల కోసం పని చేసే విధంగా, ప్రతి వ్యవస్థ, ప్రతి కార్యాలయం తమ కోసమే ఉందని ఈ రాష్ట్ర ప్రజలకు నమ్మకాన్ని కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వం ముందున్న కర్తవ్యమని చెప్పారు. ప్రభుత్వంలోని ప్రతి వ్యవస్థ ప్రజలకు జవాబుదారీగా ఉండాలని, ప్రజల కోసం మాత్రమే అధికారులు పనిచేయాలని సూచించారు. పదేళ్లలో జరిగిన కుట్రపూరితమైన పాలనకు ఇక చరమగీతం పాడుతున్నామన్నారు. ఇకపై ప్రజా దర్బార్లు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతాయని, ప్రజలు ఇచ్చిన వినతులపై తిరిగి సమాధానాలు స్పష్టంగా ప్రజలకు అందించేందుకు ప్రత్యేకంగా అధికారులను నియమిస్తామని తెలిపారు.