సంజయ్ వ్యాఖ్యలపై సీఎం మౌనమెందుకు ?

 సంజయ్ వ్యాఖ్యలపై సీఎం మౌనమెందుకు ?

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మండిపడ్డారు. సంజయ్ మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తుంటే.. సీఎం కేసీఆర్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో చెప్పాలని ప్రశ్నించారు.  సోమవారం హైదరాబాద్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. ‘‘శివలింగాలను తవ్వి తీస్తం అంటున్నవ్ కదా.. తవ్వుడు సంగతి తర్వాత, భూమ్మీద ఉన్న శివలింగాల, శివాలయాల సంగతేంది ? వాటికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఇప్పించగలవా నువ్వు ? బండి సంజయ్ ఇంకొకసారి మతాన్ని రెచ్చగొట్టేలా మాట్లాడితే ఊరుకోను. ఆదరణకు నోచుకోని శివాలయాల వివరాలతో బీజేపీ ఆఫీసు ముందు బైఠాయిస్తా’’అని జగ్గారెడ్డి హెచ్చరించారు.  ‘‘బండి సంజయ్ శివ భక్తుడు కదా.. శివలింగాల మీద మాట్లాడుతున్నడు కదా.. నేనొక రెండు శివాలయాల వివరాలు చెబుతా.. వాటికి చెరో పది కోట్లు ఇవ్వు. తర్వాత మనం వేరే విషయానికొద్దాం’’అని ఆయన వ్యాఖ్యానించారు.

కల్పగూరు శివాలయం ఫొటో చూపిస్తూ..

సంగారెడ్డి మండలం కల్పగూరు గ్రామంలో ఉన్న కాకతీయుల కాలం నాటి శివాలయం ఫొటోను ఈసందర్భంగా జగ్గారెడ్డి మీడియాకు చూపించారు. ఇలాంటి ప్రాచీన ఆలయాల అభివృద్ధి బాధ్యత బీజేపీపై, బండి సంజయ్ పై లేదా అని ప్రశ్నించారు.  ‘‘ఇలాంటి భూమ్మీద ఉన్న గుడులను,  శివాలయాలను బీజేపీ వాళ్లు పట్టించుకోరు కానీ.. మసీదుల కింద ఉన్న శివాలయాలను బయటికి తీస్తారట’’ అని జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మసీదులు తవ్వుదాం.. శివలింగాలు వస్తే మాకు. శవాలు  వస్తే మీకు’ అని బండి సంజయ్ అన్నారు.. ఇలాంటి వ్యాఖ్యలను హిందూ మత మహా పురుషులు కానీ, గ్రంథాలు కానీ ఎన్నడూ చేయలేదని స్పష్టం చేశారు.  వచ్చే ఎన్నికల్లో శివ లింగాలు, మసీదులు కేంద్రంగా రాజకీయాలు చేయాలని బీజేపీ భావిస్తోందని ఆరోపించారు. భాగ్యలక్ష్మీ దేవాలయం పేరు చెప్పి గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో 48 సీట్లను బీజేపీ సాధించిందన్నారు. ‘‘ప్రజలు రెచ్చిపోయి బీజేపీకి ఓట్లు వేస్తే జీవితాలు మారవు. ప్రతి పేదవాడికి మోదీ ఇస్తానన్న రూ.15 లక్షలు అందిన తర్వాతే... బీజేపీ గురించి ప్రజలు ఆలోచించాలి’’ అని జగ్గారెడ్డి చెప్పారు. మోదీ వల్ల దేశం, కేసీఆర్ వల్ల తెలంగాణ అప్పుల ఊబిలో కూరుకుపోయాయని ఆయన కామెంట్ చేశారు. 

మరిన్ని వార్తలు..

హత్యకు రేవంత్ కుట్ర చేశారనడం సరికాదు

"9 అవర్స్" వెబ్ సిరీస్ తో వస్తున్న హీరో తారకరత్న