వచ్చే ఎన్నికల్లో 78 స్థానాల్లో గెలుస్తం

వచ్చే ఎన్నికల్లో 78 స్థానాల్లో గెలుస్తం
  • టీఆర్​ఎస్​, బీజేపీది గల్లీలో కుస్తీ.. ఢిల్లీలో దోస్తీ..
  • వచ్చే ఎన్నికల్లో 78 స్థానాల్లో గెలుస్తం: మాణిక్కం ఠాగూర్​

షాద్ నగర్, వెలుగు: టీఆర్​ఎస్​, బీజేపీ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ గల్లీలో కుస్తీ పడుతూ ఢిల్లీలో దోస్తీ కడుతున్నారని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్​చార్జి​  మాణిక్యం ఠాగూర్  ఆరోపించారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా షాద్​నగర్​లో నిర్వహించిన కాంగ్రెస్​ మెంబర్​షిప్, ఎన్​రోలర్స్​ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కేసీఆర్  కుటుంబ పాలన అంతం చేయడానికి ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని, కాంగ్రెస్​ను అధికారంలోకి తేవడానికి కృషి చేయాలని సూచించారు. షాద్ నగర్​లో కాంగ్రెస్ పార్టీ 36 వేల సభ్యత్వాలు నమోదు చేయడం గొప్ప విషయమన్నారు. ‘‘రాష్ట్రంలో కాంగ్రెస్​ పార్టీ మిషన్ 78 ను ప్రారంభించింది. రాబోయే ఎన్నికల్లో 78 స్థానాలతో అధికారంలోకి వస్తుంది” అని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ నేతలు చేస్తున్న కబ్జాలపై రేవంత్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి  కేంద్రానికి ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవట్లేదన్నారు. రాష్ట్రాన్ని దోచుకుంటున్న కల్వకుంట్ల ఫ్యామిలీపై కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని   ఆయన ప్రశ్నించారు.

మల్లారెడ్డికి పట్టిన గతే పడుతుంది: మల్లు రవి 

కాంగ్రెస్​ను విమర్శిస్తే గట్టిగా బుద్ధి చెప్తామని మాజీ ఎంపీ మల్లు రవి హెచ్చరించారు.  రాబోయే కాలంలో గ్రామాల్లో టీఆర్ఎస్ నేతలకు మంత్రి మల్లారెడ్డికి పట్టిన గతే పడుతుందని అన్నారు.  ‘‘మల్లారెడ్డిపై జరిగిన దాడి ఎవరో చేయించింది కాదు. ప్రజల్లో వచ్చిన మార్పు” అని ఆయన అన్నారు. 500 కంటే ఎక్కువ సభ్యత్వాలు నమోదు చేసిన ఎన్​రోలర్స్ ను మాణిక్కం ఠాగూర్​ సన్మానించారు.