ఢిల్లీకి బండి సంజయ్, దాసోజ్ శ్రావణ్

ఢిల్లీకి బండి సంజయ్, దాసోజ్ శ్రావణ్

తెలంగాణ రాజకీయాలు మరింత హీటెక్కిస్తున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా ప్రకటనతో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ఇవాళ ఉప రాష్ర్టపతి ఎలక్షన్ ఉండడంతో బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఢిల్లీ వెళ్తున్నారు. ఎన్డీఏ ఉప రాష్ర్టపతి అభ్యర్థికి ఓటు వేయనున్నారు. దీంతో ఇవాళ ఒక్కరోజు పాదయాత్రకు బండి సంజయ్ విరామం ఇచ్చారు. మళ్లీ రేపటి నుంచి ఎప్పటిలానే పాదయాత్ర కొనసాగనుందని బీజేపీ పార్టీ వర్గాలు వెల్లడించాయి. 

మునుగోడు ఉప ఎన్నికపై చర్చలు

మరోవైపు బీజేపీ అగ్రనేతలు జేపీ నడ్డా, అమిత్ షాను బండి సంజయ్ కలిసే అవకాశముంది. ఈనెల 21న మునుగోడు సభ, పాదయాత్ర ముగింపు సభలకు అమిత్ షా, జేపీ నడ్డాలను ఆహ్వానించనున్నారని తెలుస్తోంది. మునుగోడు ఉప ఎన్నికపై కూడా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో చర్చించే అవకాశం ఉంది. అంతేకాదు.. బీజేపీ పాదయాత్ర విశేషాలను, తెలంగాణలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులను, బీజేపీలోకి రావాలనుకుంటున్న నాయకుల లిస్టుపై కూడా చర్చించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇటు బండి సంజయ్ ఆహ్వానం మేరకు దాసోజు శ్రావణ్ ఢిల్లీ వెళ్తున్నారు. నిన్ననే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన దాసోజ్ శ్రావణ్..  పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. మరోవైపు ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారని తెలుస్తోంది.