
బెంగళూరు: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు వ్యతిరేకంగా కర్నాటకలోని బెంగళూరులో ‘సేవ్ ఇండియా’ పేరుతో చేపట్టిన కార్యక్రమంలో ఓ యువతి ‘పాకిస్థాన్ జిందాబాద్’ అంటూ నినాదాలు చేసింది. సభకు హాజరైన ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడి వెళ్తుండగా స్టేజ్ పైకి వచ్చిన ఆ అమ్మాయి పాకిస్థాన్ అనుకూల నినాదాలు చేసింది. సభకు వచ్చిన వారినీ నినాదాలు చేయమని కోరింది. దీంతో అసద్ పరుగున వచ్చి ఆ అమ్మాయిని వారించారు. మైక్ లాక్కోవడానికి ప్రయ్నతించారు. అయినా ఆమె ఆగకపోవడంతో పోలీసులు ఆమెను స్టేజీ పై నుంచి తీసుకెళ్లారు. ఆ అమ్మాయిని అమూల్యగా గుర్తించారు. ఆమెపై 124ఏ (సెడిషన్) కింద కేసు నమోదు చేసినట్టు తెలిసింది. తర్వాత ఒవైసీ మాట్లాడారు. ‘ఆ అమ్మాయి వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాం. నాకు, నా పార్టీకి ఆ అమ్మాయితో ఎలాంటి సంబంధం లేదు. మేమెప్పుడూ ఇండియా కోసమే పని చేస్తాం. పాకిస్థాన్కు మద్దతివ్వబోం’ అన్నారు.