పోలీసులమని చెప్పి.. లాక్కెళ్లి మహిళపై అత్యాచారం

పోలీసులమని చెప్పి.. లాక్కెళ్లి  మహిళపై అత్యాచారం

    సంగారెడ్డి జిల్లా పస్తాపూర్ శివారులో దారుణం

    బీదర్ నుంచి బస్సులో వస్తున్న మహిళపై కన్నేసిన దుండగులు

   సంచి చెక్​ చేయాలని  కిందికి దించి.. ఎవరూ లేని చోటుకు లాక్కెళ్లి రేప్

సంగారెడ్డి, వెలుగు: ఇద్దరు.. చూస్తే అచ్చం పోలీసుల మాదిరే ఉన్నరు.. హైట్, కటింగ్, డ్రస్సింగ్ అంతా అట్లనే ఉంది.. బస్సులో ఉన్న ఓ మహిళపై కన్నేశారు.. పోలీసులమని చెప్పారు.. ‘అనుమానిత వస్తువులు తీసుకెళ్తున్నవ్.. విచారించాలి’ అంటూ బస్సు నుంచి కిందికి దించారు.. పోలీస్ స్టేషన్​కు తీసుకెళ్తున్నామని చెప్పి.. ఎవరూ లేని చోటుకు లాక్కెళ్లారు.. అత్యాచారానికి ఒడిగట్టారు. తర్వాత అక్కడి నుంచి ఉడాయించారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పస్తాపూర్ గ్రామ శివారులో ఈ దారుణం జరిగింది. బాధితురాలు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కేసు వివరాలను జహీరాబాద్ ఎస్ఐ ఎస్.వెంకటేశ్ వెల్లడించారు.

బీదర్ నుంచి వస్తుండగా..

సూర్యాపేట జిల్లా కోదాడ ప్రాంతానికి చెందిన ఓ మహిళ (32) మంగళవారం ఉదయం కర్ణాటకలోని బీదర్​ నుంచి గుట్కా ప్యాకెట్లతో ఆర్టీసీ బస్సులో బయల్దేరింది. అదే బస్సులో ఉన్న ఇద్దరు వ్యక్తులు తమను తాము పోలీసులమని పరిచయం చేసుకున్నారు. ‘మీ చేతిలో ఉన్న సంచిలో నిషేధిత వస్తువులు ఉన్నట్టు మాకు సమాచారం వచ్చింది. తనిఖీ చేయాలి’ అని ఆమెపై ఒత్తిడి చేశారు. ఈ క్రమంలో ముగ్గురి మధ్య బస్సులోనే కొద్ది సేపు గొడవ జరిగింది. పస్తాపూర్ గ్రామం సమీపంలోకి బస్సు రాగానే దుండగులు బస్సు ఆపి మహిళతో సహా కిందికి దిగారు. అక్కడ కొంతసేపు అటు ఇటు తిరిగారు. తర్వాత ఇద్దరు దుండగుల్లో ఒకరు గుట్కా బ్యాగ్​కు కాపలాగా ఉండి.. మరో వ్యక్తి ఆ మహిళను పస్తాపూర్ ఎస్​బీఐ వెనక్కి బలవంతంగా లాక్కెళ్లాడు. భయపెట్టి రేప్ చేశాడు. తర్వాత బ్యాగ్ వద్ద కాపలాగా ఉన్న మరో వ్యక్తి కూడా మహిళపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. ఆమె అరవడంతో ఇద్దరు దుండగులు గుట్కా బ్యాగ్​తో అక్కడి నుంచి పరారయ్యారు. బాధిత మహిళ జహీరాబాద్ పోలీసులను ఆశ్ర యించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు  దర్యాప్తు
చేస్తున్నారు.