ముషీరాబాద్, వెలుగు: పిల్లలు, బాలికలపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమవుతున్నాయని జస్టిస్ డాక్టర్ జి రాధారాణి ఆవేదన వ్యక్తం చేశారు. పోక్సో, దిశ, నిర్భయ, గృహహింస, వరకట్న నిరోధక చట్టం వంటి కఠినమైన చట్టాలు ఉన్నప్పటికీ, మహిళలకు సరైన న్యాయం అందడం లేదన్నారు.
శుక్రవారం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆల్ ఇండియా డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో బాలికలు, చిన్నారులపై జరుగుతున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా జాతీయ సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలో అనునిత్యం ఏదో ఒకచోట బాలికలు, చిన్నారులు, మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని, వాటిని ప్రభుత్వాలు అరికట్టలేకపోతున్నాయన్నారు. మహిళల కోసం చట్టసభల్లో అనేక చట్టాలు తీసుకొచ్చినా దాడులు కొనసాగడం బాధాకరమన్నారు.
రిటైర్డ్ సైంటిస్ట్ డాక్యుమెంటరీ ఫిలిం మేకర్ గౌహర్ రజా, రాజకీయ ఆర్థికవేత్త పరకాల ప్రభాకర్, స్టూడెంట్ ఆర్గనైజేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి శిబిశిస్ ప్రవరాజ్, శృతి మాట్లాడారు. అశ్విని, ప్రశాంత్ కుమార్ పాల్గొన్నారు.
