బయటోళ్లకు మార్షల్స్ గెటప్‌ వేసి మహిళా ఎంపీలపై దాడి!

బయటోళ్లకు మార్షల్స్ గెటప్‌ వేసి మహిళా ఎంపీలపై దాడి!
  • ఢిల్లీలో 15 ప్రతిపక్ష పార్టీల నిరసనల ర్యాలీ

న్యూఢిల్లీ: బయటి వ్యక్తులకు మార్షల్స్ డ్రస్‌లు వేసి నిన్న (బుధవారం) పార్లమెంట్‌లోకి తీసుకొచ్చి మహిళా ఎంపీలపై దాడి చేయించారంటూ కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. పార్లమెంటులో ప్రజాస్వామ్యాన్ని హత్య చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీనికి నిరసన తెలుపుతూ గురువారం ఉదయం కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో 15 ప్రతిపక్ష పార్టీల నాయకులు పార్లమెంట్‌ దగ్గర నుంచి విజయ్‌ చౌక్‌ వరకు ర్యాలీ చేశారు. 
బుధవారం రాజ్యసభలో ప్రతిపక్షాలు నిరసన తెలుపుతూ చైర్మన్ వెల్‌లోకి వెళ్లిన సందర్భంగా వారిని కంట్రోల్ చేసేందుకు మార్షల్స్‌ లోపలి వచ్చారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష ఎంపీలకు, మార్షల్స్‌కు మధ్య తోపులాట జరిగింది. అయితే మగ మార్షల్స్‌ తమపై మ్యాన్‌హ్యాండిలింగ్ చేశారని కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు మహిళా ఎంపీలు ఆరోపిస్తున్నారు.

ఈ ఘటనకు నిరసనగా ఇవాళ రాహుల్ నేతృత్వంలో చేపట్టిన నిరసనలో ఆయన మాట్లాడుతూ.. పార్లమెంట్‌లో ఎంపీలపై దాడి చేయడం ఇదే తొలిసారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీలపై దాడి చేయడానికి బయటి వాళ్లను సభలోకి తీసుకొచ్చారని, ఈ విషయాన్ని పక్కన పెట్టి అధికార పార్టీ నేతలు రాజ్యసభ చైర్మన్ కన్నీళ్ల గురించి మాట్లాడుతున్నారని, సభ సజావుగా సాగేలా చూడాల్సిన బాధ్యత చైర్మన్‌దేనన్న విషయం గుర్తించాలని రాహుల్ చెప్పారు.  పెగాసస్ హ్యాకింగ్, ధరల పెరుగుదల, రైతుల సమస్యలను తాము సభలో లేవనెత్తామన్నారు. కానీ పార్లమెంటులో తమ గళాన్ని ప్రభుత్వం నొక్కేసిందని, దీంతో ఇవాళ తమ వాయిస్ వినిపించేందుకు రోడ్డెక్కాల్సి వచ్చిందని చెప్పారు. ఇది ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడమేనని రాహుల్ అన్నారు. పార్లమెంటులో 60 శాతం దేశ ప్రజల వాయిస్‌ను అణచివేశారని, నిన్న ఏకంగా భౌతిక దాడికి దిగారని ఆయన ఆరోపించారు.

పార్లమెంటా.. పాకిస్థాన్ బోర్డరా?

 శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మాట్లాడుతూ పార్లమెంటులోకి మార్షల్స్‌ దుస్తుల్లో బయటి వ్యక్తులు వచ్చి మహిళా ఎంపీలపై దాడి చేశారని ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడమేనని, నిన్న తనకు పార్లమెంటులో ఉన్నట్టుగా కాక పాకిస్థాన్ బోర్డర్‌‌లో ఉన్నట్టుగా అనిపించిందని చెప్పారు. ఎన్సీపీ చీఫ్​ శరద్ పవార్ మాట్లాడుతూ తన 55 ఏండ్ల పార్లమెంట్ అనుభవంలో రాజ్యసభలో ఇలా మహిళా  ఎంపీలపై దాడి చేయడం ఎప్పుడూ చూడలేదని అన్నారు. 

ఎంపీలే మార్షల్స్‌పై దాడి చేశారు

ప్రతిపక్ష నేతల ఆరోపణలపై పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి స్పందించారు. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని ఆయన అన్నారు. మార్షల్స్‌పైనే కొన్ని పార్టీల ఎంపీలు దాడి చేశారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహిళా ఎంపీలపై మార్షల్స్ దాడి ఆరోపణల్లో ఏ మాత్రం నిజం లేదని, సభ సీసీటీవీ ఫుటేజ్ చూస్తూ ఈ విషయం తేలిపోతుందని ప్రహ్లాద్ జోషి స్పష్టం చేశారు.