నేటి నుంచి విమెన్స్​ ప్రీమియర్​ లీగ్​ 

నేటి నుంచి విమెన్స్​ ప్రీమియర్​ లీగ్​ 
  • ఇక అమ్మాయిల ధనాధన్​ 
  • నేటి నుంచి విమెన్స్​ ప్రీమియర్​ లీగ్​ 
  • తొలి పోరులో గుజరాత్‌తో ముంబై ఢీ
  • రా. 7.30 నుంచి స్పోర్ట్స్‌ 18, జియో టీవీలో లైవ్‌

టీ20 ఫార్మాట్‌లో అసలైన మజా చూపెడుతూ... వరల్డ్‌ క్రికెట్‌ దశ, దిశనే మార్చింది ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌. 2008లో ఐపీఎల్‌ షురూ అయ్యాక క్రికెట్‌ కొత్త పుంతలు తొక్కింది. లీగ్​ క్రికెటర్లపై కాసుల వర్షం కురిపించి, బీసీసీఐకి బంగారు బాతుగా మారింది. అన్నింటికి మించి మెన్స్‌ క్రికెట్‌ను మరో మెట్టు ఎక్కించింది. ఇప్పుడు విమెన్స్‌ క్రికెట్‌ను  ఆ స్థాయికి తీసుకెళ్లేందుకు పునాది పడబోతోంది. అమ్మాయిల ఆటను అందలం ఎక్కించే విమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) వచ్చేసింది. ఐదు జట్లతో బీసీసీఐ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మెగా లీగ్ ముంబైలో నేడు షురూ అవుతోంది.

ముంబై:   ఎన్నో ఏండ్ల నుంచి అమ్మాయిలు ఆశగా, ఆత్రుతగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. విమెన్స్‌‌‌‌ క్రికెట్‌‌లో కొత్త చరిత్ర మొదలవనుంది. ఇండియా విమెన్ క్రికెటర్ల ఆటను మరో స్థాయికి తీసుకెళ్లబోతున్న డబ్ల్యూపీఎల్‌‌ శనివారం నుంచి 23 రోజుల పాటు అలరించనుంది. ఇండియా కెప్టెన్‌‌ హర్మన్ ప్రీత్‌‌ నేతృత్వంలోని ముంబై ఇండియన్స్‌‌, గుజరాత్‌‌ జెయింట్స్‌‌ మధ్య తొలి పోరుతో లీగ్‌‌కు తెరలేవనుంది. మెగా టోర్నీలో  ఓ ఎలిమినేటర్‌‌, ఫైనల్‌‌ సహా మొత్తం 22 మ్యాచ్‌‌లు ఉన్నాయి. ఈ లీగ్‌‌తో క్రికెటర్లకు భారీ మొత్తం దక్కడంతో పాటు వారి ఖ్యాతి కూడా పెరగనుంది. తెలుగమ్మాయి స్నేహదీప్తి లాంటి క్రికెటర్లు తమ అభిరుచికి అమ్మతనం అడ్డురాదని నిరూపించబోతున్నారు. జమ్మూ కాశ్మీర్‌‌కు చెందిన జసియా అక్తర్‌‌ తన పవర్‌‌ హిట్టింగ్‌‌తో బాల్‌‌ను స్టాండ్స్‌‌కు చేర్చి.. ఉమ్రాన్‌‌ మాలిక్‌‌ మాదిరిగా తన రాష్ట్రానికి పేరు తీసుకురావాలని, తనలాంటి అమ్మాయిలూ క్రికెట్‌‌ను కెరీర్‌‌గా ఎంచుకునేందుకు బాటలు వేయాలని చూస్తోంది.ఇప్పటికే స్టార్‌‌డమ్‌‌ తెచ్చుకున్న హర్మన్‌‌, మంధాన, రోడ్రిగ్స్‌‌, షెఫాలీ తమ టాలెంట్‌‌కు మరింత పదును పెట్టి  హైఓల్టేజ్‌‌ గ్లోబల్‌‌ టోర్నీల్లో ఇండియాను ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధం కాబోతున్నారు. యంగ్‌‌స్టర్స్‌‌కు  వరల్డ్ బెస్ట్ స్టార్లతో ఆడే చాన్స్‌‌ లభించనుంది.

వీళ్లపై ఫోకస్‌‌

ఈ లీగ్‌‌ ప్రారంభానికి ముందే వరల్డ్‌‌ క్రికెట్‌‌ దృష్టిని ఆకర్షించింది. ఐదు ఫ్రాంచైజీలు ఏకంగా రూ. 4,669 కోట్లు పలికాయి. అదానీ గ్రూప్‌‌ రూ. 1289 కోట్లతో గుజరాత్‌‌ జెయింట్స్‌‌ టీమ్‌‌ను కొన్నది. ప్లేయర్ల ఆక్షన్‌‌లో రూ. 59.50 కోట్లు ఖర్చవగా.. వేలం మెన్స్‌‌ ఐపీఎల్‌‌ను తలపించింది. ఆర్‌‌సీబీ కెప్టెన్‌‌ మంధానాను రికార్డు స్థాయిలో రూ. 3.4 కోట్లు దక్కించుకోగా.. మరో ఆరుగురు రెండు కోట్లపైనే పలికారు. మంధానతో పాటు హర్మన్‌‌, వరల్డ్‌‌ కప్‌‌ విన్నింగ్‌‌ ఆస్ట్రేలియా టీమ్స్‌‌లో మెంబర్స్‌‌ అయిన మెగ్‌‌ లానింగ్‌‌ (ఢిల్లీ), అలీసా హీలీ (యూపీ), బెత్‌‌ మూనీ (గుజరాత్‌‌), ఇంగ్లండ్‌‌ స్టార్లు నాట్‌‌ సివర్‌‌, సోఫీ ఎకిల్‌‌స్టోన్‌‌, ఇండియన్స్‌‌ షెఫాలీ, దీప్తి శర్మ, రేణుకా సింగ్‌‌, రిచా ఘోశ్‌‌పై అందరి ఫోకస్‌‌ ఉంది. ఓవర్‌‌నైట్‌‌ స్టార్లు అయ్యే అవకాశం ఉండటంతో.. లోకల్‌‌, ఫారినర్స్‌‌ కూడా సత్తాచాటేందుకు ఊవ్విళ్లూరుతున్నారు.

ఆట ఇట్ల

డబ్ల్యూపీఎల్​ రౌండ్‌‌ రాబిన్‌‌ దశలో ప్రతీ జట్టు మిగతా 4  జట్లతో రెండేసి సార్లు పోటీ పడుతుంది. టాప్‌‌లో నిలిచిన జట్టు నేరుగా ఫైనల్‌‌ చేరుతుంది. 2,3 ప్లేస్‌‌లో నిలిచిన జట్లు మరో ఫైనల్‌‌ బెర్తు కోసం ఎలిమినేటర్‌‌లో పోటీ పడతాయి. లీగ్​ దశలో విజయానికి 2 పాయింట్లు లభిస్తాయి. మ్యాచ్‌‌ టై అయితే ఫలితం తేలే వరకూ సూపర్‌‌ ఓవర్లు ఆడిస్తారు. సూపర్‌‌ ఓవర్లు సాధ్యం కాకపోతే ఇరు జట్లకు చెరో పాయింట్‌‌ ఇస్తారు. ఎలిమినేటర్‌‌, ఫైనల్‌‌ మ్యాచ్‌‌ టై అయి సూపర్‌‌  ఓవర్‌‌ సాధ్యం కాకపోతే ఇరు జట్లలో రౌండ్‌‌ రాబిన్‌‌ దశలో టాప్‌‌ ప్లేస్‌‌లో ఉన్న టీమ్‌‌ను విన్నర్‌‌గా డిక్లేర్‌‌ చేస్తారు. ఇక,  మెన్స్‌‌ మాదిరిగా తుది జట్టులో నలుగురు ఫారినర్స్‌‌ ఉండాలి. అసోసియేట్‌‌ నేషన్‌‌ ప్లేయర్‌‌ ఉంటే ఐదో ఫారినర్‌‌గా ఆడించొచ్చు.  ఢిల్లీలో  మాత్రమే అసోసియేటెడ్ నేషన్‌‌ ప్లేయర్ (టరా నోరిస్‌‌-– యూఎస్‌‌ఏ) ఉంది. ఈ సీజన్​  మొత్తం ముంబైలోని బ్రబౌర్న్, డీవై పాటిల్ స్టేడియాల్లోనే జరుగుతుంది.