దునియాలో నేను ఎవరికీ భయపడను

దునియాలో నేను ఎవరికీ భయపడను

న్యూఢిల్లీ: మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ జాతిపితను స్మరించుకుంటూ ట్వీట్ చేశారు. ఎలాంటి అన్యాయానికీ తాను తలొగ్గబోనని రాహుల్ పేర్కొన్నారు. ‘ప్రపంచంలోని ఎవరికీ నేను భయపడను. ఎలాంటి అన్యాయానికీ తలొగ్గను. నిజానికి ఉన్న శక్తితో అబద్ధాలపై విజయం సాధిస్తా. అసత్యాలపై పోరాడే క్రమంలో ఎదురయ్యే అన్ని కష్టాలను ఎదుర్కొంటా. అందరికీ గాంధీ జయంతి శుభాకాంక్షలు’ అని రాహుల్ ట్వీట్ చేశారు. హత్రాస్ బాధితురాలి కుటుంబీకులను కలవడానికి గురువారం బయల్దేరిన రాహుల్, ప్రియాంక వాహనాలను పోలీసులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. అనంతరం కాలినడకన పార్టీ కార్యకర్తలతో వెళ్తున్న రాహుల్‌‌ను పోలీసులు మళ్లీ అడ్డుకున్నారు. అక్కడ జరిగిన తోపులాటలో రాహుల్ కింద పడిపోయారు. ఆ తర్వాత రాహుల్, ప్రియాంకను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై రాహుల్ తీవ్రంగా మండిపడ్డారు. తనను పోలీసులు కిందకు నెట్టేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను ఎందుకు అరెస్ట్ చేశారని, తాను ఏ చట్టాలనూ ఉల్లంఘించలేదని రాహుల్ పేర్కొన్నారు.