రైల్వేస్టేషనా? ఎయిర్పోర్టా..!..సికింద్రాబాద్ రైల్వేస్టేషన్కు ఆధునిక హంగులు 

రైల్వేస్టేషనా? ఎయిర్పోర్టా..!..సికింద్రాబాద్ రైల్వేస్టేషన్కు ఆధునిక హంగులు 
  • శరవేగంగా పునర్నిర్మాణపనులు
  •  ఇప్పటికే 70 శాతం పూర్తి
  • డిసెంబర్​లోనే అందుబాటులోకి...

సికింద్రాబాద్​ రైల్వేస్టేషన్​ను అంతర్జాతీయ ప్రమాణాలతో పునర్నిర్మిస్తున్నారు. ఇప్పటికే చర్లపల్లి టెర్మినల్​ను అభివృద్ధి చేసి అందుబాటులోకి తీసుకురాగా, సికింద్రాబాద్​రైల్వే స్టేషన్​ను కూడా ఎయిర్​పోర్ట్​తరహాలో డెవలప్​చేస్తున్నారు. 2022లో పనులు ప్రారంభించిన దక్షిణ మధ్య రైల్వే.. ఈ ఏడాది డిసెంబర్​నాటికి అందుబాటులోకి తీసుకువస్తామని ప్రకటించింది. ఇప్పటికే 70 శాతం పనులు పూర్తి కాగా, అనుకున్న టైంలోగా రీ ఓపెన్​చేయడానికి పనులు స్పీడప్​చేస్తున్నారు. 

హైదరాబాద్​సిటీ, వెలుగు:  దేశంలోనే అత్యున్నత స్టేషన్​గా నాన్​సబర్బన్​గ్రేడ్​–1(ఎస్​ఎస్​జి1)ఉన్న సికింద్రాబాద్​రైల్వే స్టేషన్​నుంచి రోజుకు 180 రైళ్లు దేశంలోని వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నాయి. రోజుకు1.60 లక్షల ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు.

రాను రాను ప్రయాణికులు పెరుగుతుండడం, రైళ్ల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని ఈ స్టేషన్​ను మరింత ఆధునీకరించేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. సుమారు రూ. 714.73 కోట్లతో 2022లో స్టేషన్​పునర్నిర్మాణ పనులు చేపట్టారు. 90 శాతం సివిల్​పనులు పూర్తికాగా, లిఫ్ట్​లు ఏర్పాటు చేశారు. ఎస్కలేటర్ల నిర్మాణం జరుగుతోంది. మిగిలిన పనులు శరవేగంగా జరుగుతున్నట్టు అధికారులు తెలిపారు. 

ఏం సౌలత్​లు ఉన్నాయంటే..

ఆధునిక హంగులతో ఒక ఐకానిక్​ స్టేషన్​గా సికింద్రాబాద్​రైల్వే స్టేషన్​ను తీర్చిదిద్దుతున్నారు. రైల్వేస్టేషన్​ను 1,65,566  చ. మీ. విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. ఉత్తరం వైపున జి+3 ఫ్లోర్స్​ (22516 చ. మీ.)తో,  దక్షిణ వైపున జి+3ఫ్లోర్స్​తో (14,792 చ. మీ. ) స్టేషన్​ను నిర్మిస్తున్నారు. పాత ప్లాట్​ఫారాలు 30 ఫీట్లతో ఉంటే..ఇప్పుడు రెండు వైపులా 108 మీ.X120 మీ. సైజుల్లో నిర్మిస్తున్నారు. రెండు వైపు టెర్మినల్​లో ఫస్ట్​ లెవెల్​లో కాఫీషాపులు, ఫుడ్​కోర్టులు ఏర్పాటు చేస్తున్నారు. స్టేషన్​కు వచ్చే ప్రయాణికుల కోసం ఏకంగా 26 లిఫ్టులు, 32 ఎస్కలేటర్లు కడుతున్నారు. రెండు వైపులా మల్టీలెవెల్​పార్కింగ్​సౌకర్యం కల్పిస్తున్నారు. 

స్టేషన్​ బయటకు రాకుండానే...

ట్రైన్​దిగిన వారు నేరుగా బయటకు రాకుండా నేరుగా మెట్రోస్టేషన్లకు, బస్​స్టేషన్లకు చేరుకునే విధంగా వాక్​ త్రూ కనెక్టివిటీ ఏర్పాటు చేస్తున్నారు. కరెంట్​కోసం 5 కిలోవాట్ల కెపాసిటీతో రెండు భారీ సబ్​స్టేషన్లను నిర్మిస్తున్నారు. భద్రత కోసం అడ్వాన్సుడ్​సెక్యూరిటీ సిస్టమ్​ ఏర్పాటు చేస్తున్నారు. గంటకు 25 వేల మంది రాకపోకలు సాగించే అవకాశం ఉంటుంది గనక ఆ స్థాయిలో సౌకర్యలు కల్పిస్తున్నారు. పనులు పూర్తయిన తర్వాత గంటకు 35 వేల మంది రాకపోకలు సాగించినా ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్మాణం జరుపుతున్నారు. ప్రస్తుతం రైళ్ల రాకపోకలు, ప్రయాణీకులకు ఎలాంటి ఆటంకం లేకుండా నిర్మాణ పనులు జరుగుతున్నాయి. స్టేషన్​లో 3వేల మంది కూర్చునేలా వెయిట్​హాల్​, ఆధునిక క్యాంటీన్​, రెస్టారెంట్​లు అందుబాటులోకి రానున్నాయి.