కొత్త మెడికల్ కాలేజీల పనులు వేగవంతం చేయాలి : హరీష్ రావు

కొత్త మెడికల్ కాలేజీల పనులు వేగవంతం చేయాలి :  హరీష్ రావు

రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయబోయే తొమ్మిది మెడికల్ కాలేజీల పనులను వేగవంతం చేయాలని మంత్రి హరీష్ రావు ఉన్నతాధికారులను ఆదేశించారు. ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కార్యాలయం నుంచి ఎన్‌హెచ్ఎం, టీఎస్ఎంఎస్ఐడీసీల‌పై మంత్రి  నెలవారీ సమీక్ష నిర్వహించారు. సీఎం కేసీఆర్ మార్గానిర్దేశనంలో గతేడాది 8 మెడికల్ కాలేజీలు ఒకేసారి ప్రారంభించి రికార్డు సృష్టించామని, ఇదే స్ఫూర్తితో ఈ ఏడాది కరీంనగర్, ఖమ్మం, కామారెడ్డి, వికారాబాద్, జనగాం, నిర్మల్, భూపాలపల్లి, సిరిసిల్ల, ఆసిఫాబాద్ జిల్లాల్లో ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి సూచించారు.  నేషనల్ మెడికల్ కౌన్సిల్ బృందం పరిశీలనకు వచ్చేనాటికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తికావాలన్నారు. 

మాతాశిశు సంరక్షణ కేంద్రాలను వెంటనే పూర్తి చేయాలె 

ఇక నిర్మాణంలో ఉన్న మాతాశిశు సంరక్షణ కేంద్రాలను వెంటనే పూర్తి చేయాలని మంత్రి హరీష్ చెప్పారు. నిమ్స్ గాంధీ ఆసుపత్రిలో నిర్మిస్తున్న ఎంసీహెచ్ ఆసుపత్రులను వేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. టీవీవీపీ పరిధిలో కొనసాగుతున్న 23 సీహెచ్సీల పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. ఇప్పటికే 20 తెలంగాణ డయాగ్నొస్టిక్ సెంటర్లు ఉన్నాయని, వివిధ జిల్లాల్లో కొత్తగా ఏర్పాటు చేస్తున్న 13 సెంటర్లను త్వరగా అందుబాటులోకి తీసుకువచ్చేలా పనిచేయాలన్నారు. మార్చురీల పనులు, 12 సెంట్రల్ మెడిసిన్ స్టోర్స్ పనులు వేగంగా పూర్తి చేయాలి తెలిపారు. ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాల సమీపంలో 9 క్రిటికల్ కేర్ హాస్పిటల్స్ ఏర్పాటు చేస్తున్నామని, ఈ పనులు త్వరగా పూర్తి చేసి యాక్సిడెంట్స్ బాధితులకు సకాలంలో వైద్యం అందేలా చూడాలని సూచించారు. 

అన్ని ఆసుపత్రుల్లో మందులు అందుబాటులో ఉండేలా చూడాలె

మరోవైపు అన్ని ఆసుపత్రుల్లో మందులు అందుబాటులో ఉండేలా చూడాలని, మూడు నెలల బఫర్ స్టాక్ మెంటెయిన్ చేయాలని మంత్రి హరీష్ రావు తెలిపారు. మందుల సరఫరాలో ఎలాంటి నియంత్రణ ఉండవద్దని, అవసరమైన మేరకు మందులు ఆయా ఆస్పత్రుల‌కు పంపిణీ చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య పరీక్షలు నిర్వహించి, 24 గంటల్లోగా పరీక్ష ఫలితాలు వచ్చేలా చూడాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని వైద్య పరికరాలు నిత్యం పనిచేసే విధంగా ఉండేందుకు గాను, తక్షణం రిపేర్లు చేసేందుకు ఏర్పాటు చేసుకున్న ఇ ఉపకరణ్ పోర్టల్ ను పూర్తిగా వినియోగించాలన్నారు.  వైద్య పరికరాలు చెడిపోయిన సమయంలో వెంటనే ఉపకరణ్ లో అప్ డేట్ చేయాలని, తద్వారా సకాలంలో రిపేర్ చేయడం జరుగుతుందని మంత్రి చెప్పారు. ఆస్పత్రుల్లో వైద్య పరికరాలు పూర్తిస్థాయిలో పనిచేసే విధంగా చూసుకోవడం సూపరింటెండెంట్ల బాధ్యతేనన్నారు. ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు ఖర్చు చేస్తూ వైద్య పరికరాలు సమకూర్చుతున్నదని ఇవి ప్రజలకు పూర్తిస్థాయిలో సద్వినియోగపడేలా చూడటం మన బాధ్యతనని వెల్లడించారు.