పేదరికం సగం తగ్గింది

పేదరికం సగం తగ్గింది

15 ఏళ్లలో 7కు పైగా వృద్ధి రేటు: ప్రపంచ బ్యాంకు

దే శంలో పేదరికం తగ్గిందా? పేదోళ్లు తగ్గుతున్నరా? అంటే అవుననే అంటోంది ప్రపంచ బ్యాంకు. 1990 నుంచి ఇప్పటిదాకా దేశంలో పేదరికం సగానికి సగం తగ్గిందని వెల్లడించింది. గత పదిహేనేళ్లలో పేదరికం తగ్గుదలలో ఏడుకు మించి వృద్ధి రేటును సాధించిందని పేర్కొంది. ప్రపంచాభివృద్ధికి ఇండియా సక్సెస్​ కీలకమని వ్యాఖ్యానించింది. పేదరిక నిర్మూలనలో ప్రపంచ దేశాలకు మార్గదర్శిగా ఉంటుందని తెలిపింది. ఇంటర్నేషనల్​ మానిటరీ ఫండ్​ (ఐఎంఎఫ్​)తో వార్షిక సమావేశం సందర్భంగా ప్రపంచ బ్యాంకు ఈ విషయాలు వెల్లడించింది. మున్ముందు ఇండియాకు కఠిన సవాళ్లు ఎదురవుతాయని తెలిపింది. కాబట్టి వనరులను మెరుగ్గా వాడుకుంటూ స్థిరమైన వృద్ధిని ఇండియా సాధించాల్సి ఉంటుందని సూచించింది.

పట్టణాలు, నగరాల్లో భూములను సరైన రీతిలో వాడుకుంటూ ఇండియా ఉత్పత్తిని పెంచాల్సి ఉంటుందని ప్రపంచ బ్యాంకు సూచించింది. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ దిగుబడులను పెంచాలని పేర్కొంది. అందరికీ నీళ్లందేలా చర్యలు తీసుకోవాలని, నీటి విలువను తెలిపే కార్యక్రమాలను చేపట్టాలని సూచించింది. దేశంలో ఇంకా 23 కోట్ల మంది కరెంట్​ లేక చీకట్లలోనే మగ్గుతున్నారని, వారందరికీ కరెంట్​ కనెక్షన్లను ఇప్పించాలని పేర్కొంది. అయితే, పర్యావరణానికి మేలు చేసే పద్ధతులను ఎంచుకోవాలని సూచించింది.