లాక్ డౌన్ ను సడలిస్తున్న ప్రపంచ దేశాలు

లాక్ డౌన్ ను సడలిస్తున్న ప్రపంచ దేశాలు

న్యూఢిల్లీ: కరోనా లాక్‌‌డౌన్‌‌ను ప్రపంచ దేశాలు మెల్లమెల్లగా ఎత్తేస్తున్నాయి. బయటికి రావొచ్చంటూ సడలింపులిస్తున్నాయి. సోషల్‌‌ డిస్టెన్స్‌‌తో పనులు చేసుకోవచ్చంటున్నాయి. దీంతో వారాలకు వారాలు ఇండ్లల్లోనే ఉన్న జనాలు బయటకొస్తున్నారు. అమెరికా నుంచి యూరప్‌‌ దాకా.. ఆఫ్రికా నుంచి ఆసియా దాకా రోడ్ల మీద కనబడుతున్నరు.

రెండ్రోజుల్లో బీజింగ్‌‌ పార్కులకు 17 లక్షల మంది!

కరోనా పుట్టిన చైనాలో టూరిస్టు ప్రదేశాలకు జనాలు క్యూ కడుతున్నారు. అక్కడ ఈ మధ్యే లాక్‌‌డౌన్‌‌ ఎత్తేయడం, మంగళవారం నుంచి 5 రోజులు సెలవులు ఉండటంతో పర్యాటక ప్రదేశాలకు పోటెత్తుతున్నారు. సెలవుల ఫస్ట్‌‌ రెండు రోజుల్లో బీజింగ్‌‌లోని పార్కులను 17 లక్షల మంది సందర్శించారని చైనా మీడియా చెప్పింది. షాంఘైలోని మెయిన్‌‌ టూరిస్టు ప్లేస్‌‌లకు పది లక్షల మంది వెళ్లారంది. చాలా పర్యాటక ప్రదేశాలు 30 శాతం మంది విజిటర్లకే అనుమతిచ్చాయని తెలిపింది.

జనం జాగ్రత్తగా ఉండాలె: స్పెయిన్‌‌

స్పెయిన్‌‌లో లాక్‌‌డౌన్‌‌ విధించిన మార్చి 14 తర్వాత తొలిసారి సడలింపులివ్వడంతో శనివారం జనం బయటకొచ్చారు. దేశంలో ఇప్పటికే 25 వేల మందికి పైగా చనిపోయారని, జాగ్రత్తగా ఉండాలని జనాన్ని ఆ దేశ ప్రధాని పెడ్రో సాన్‌‌చెజ్‌‌ హెచ్చరించారు. వ్యాక్సిన్‌‌ వచ్చే వరకు ఇలాంటి వినాశాలను ఇంకా చూడాల్సి ఉంటుందని చెప్పారు. పబ్లిక్‌‌ ట్రాన్స్‌‌పోర్ట్‌‌లో వెళ్లే వాళ్లు మాస్క్‌‌ వాడాల్సిందేనని సర్కారు ఆదేశాలు జారీ చేసింది.

అమెరికాలో రెండు వర్గాలు..

అమెరికాలో లాక్‌‌డౌన్‌‌ను పరిస్థితిని బట్టి పెంచాలని కొన్ని రాష్ట్రాలు కోరుతుంటే ఇంకొన్ని రాష్ట్రాలు తొలగించాలని డిమాండ్‌‌ చేస్తున్నాయి. జనం జాబ్‌‌ లేక ఇబ్బంది పడుతున్నది నిజమేనని, కానీ పరిస్థితి తెలియకుండా ఎత్తేస్తే అంతకు మించిన పరిణామాలుంటాయని న్యూయార్క్‌‌ గవర్నర్‌‌ హెచ్చరించారు. ఇక న్యూయార్క్‌‌ సిటీలోని సెంట్రల్‌‌ పార్కులో శనివారం జాగింక్‌‌కు వచ్చిన వాళ్లు ఒకరికొకరు అస్సలు పలకరించుకోలేదు. న్యూజెర్సీలోనూ పార్కులను తెరిచారు. కానీ 50 శాతం మందికన్నా ఎక్కువగా అనుమతించట్లేదు.

జపాన్‌‌లోనూ సడలించే చాన్స్‌‌

జపాన్‌‌లో ఆంక్షలను సడలించే అంశాన్ని ఆ దేశం పరిశీలిస్తోంది. ఎకానమీని మెల్లగా స్టార్ట్‌‌ చేయాలని చూస్తోంది. సరైన కట్టడి చర్యలతో పార్కులు, మ్యూజియంలు, లైబ్రరీలను రీ ఓపెన్‌‌ చేయాలనుకుంటోంది.

సింగపూర్‌‌లో మే 12 నుంచి..

సింగపూర్‌‌లో మే 12 నుంచి సెలెక్టెడ్‌‌ బిజినెస్‌‌ పనులకు అనుమతించనున్నారు. రెండు నెలలు పాక్షిక లాక్‌‌డౌన్‌‌ పెట్టునున్నారు. ఇంటి నుంచి పని చేసే అవకాశమున్న వాళ్లు జూన్‌‌ 1 తర్వాత కూడా అలానే పని చేయాలని సర్కారు చెప్పింది. ఇక మే 11 నుంచి గవర్నమెంటు, ప్రైవేటు సెక్టార్లను స్టార్ట్‌‌ చేయాలని శ్రీలంక చెప్పింది. బంగ్లాదేశ్‌‌ పోయిన నెలలోనే వేలాది గార్మెంట్‌‌ ఫ్యాక్టరీలు తెరుచుకోవడానికి అనుమతిచ్చింది.

సౌదీలో మెల్లగా పెద్ద ప్రాజెక్టులు

కరోనా ప్రభావం వల్ల నష్టపోయిన ఎకానమీని పునరుద్ధరించేందుకు కఠినమైన నిర్ణయాలు, చర్యలు తీసుకుంటామని సౌదీ అరేబియా వెల్లడించింది. బడ్జెట్‌‌ ఖర్చులను చాలా వరకు తగ్గించుకుంటామంది. ముఖ్యంగా పెద్ద పెద్ద ప్రాజెక్టుల పనులు మెల్లగా చేస్తామని చెప్పింది. కరోనా లాక్‌‌డౌన్‌‌ వల్ల ఆయిల్‌‌ ధరలు ఇప్పటికే చాలా తగ్గిపోయాయి.

రష్యాలో ఒక్కరోజే 10 వేలు

రష్యాలో ఆదివారం ఒక్కరోజే 10,633 కొత్త కేసులు నమోదయ్యాయని అక్కడి హెల్త్ డిపార్ట్‌‌మెంట్ ప్రకటించింది. ఇందులో సగానికి పైగా కేసులు రాజధాని మాస్కోలోనే నమోదయ్యాయంది. గత 24 గంటల్లో 58 మంది మృత్యువాత పడినట్లు పేర్కొంది. ఇప్పటివరకు ఆ దేశంలో 134,000 కేసులు నమోదయ్యాయి. పేషెంట్లు పెరుగుతుండటంతో రష్యాలోని మాస్కోలో స్పోర్ట్స్‌‌ కాంప్లెక్స్‌‌లను తాత్కాలిక హాస్పిటళ్లుగా మారుస్తున్నారు. కేసుల సంఖ్య పెరుగుతున్నా మే 12 నుంచి జోన్‌‌ల వారీగా లాక్‌‌డౌన్‌‌ను సడలిస్తామని వెల్లడించింది.

బ్యాంకాక్‌‌లో సడలింపులు..

బ్యాంకాక్‌‌లో ఆదివారం ఆంక్షలు సడలించడంతో పార్కులు తెరుచుకున్నాయి. బార్బర్లు, హెయిర్‌‌ డ్రెస్సర్ షాపులూ ఓపెన్‌‌ అయ్యాయి. ఆంక్షలు సడలించగానే చాలా మంది బీర్లు, ఆల్కహాల్‌‌ను కొనడానికి ఎగబడ్డారు. హెయిర్‌‌ కటింగ్‌‌కు బుక్‌‌ చేసుకున్నారు. పార్కులల్లో జాగింక్‌‌కు తక్కువ మంది వచ్చారు. ఎక్కడైనా జనం గుమికూడితే పార్క్‌‌ గార్డ్స్‌‌ విజిల్స్‌‌ ఊది అలర్ట్‌‌ చేస్తున్నారు.