ప్రపంచకప్ లీగ్ దశలో టాప్ లో నిలిచిన భారత్ సెమీఫైనల్లో తడబడింది. సెమీస్ లో న్యూజిలాండ్ చేతిలో 18 రన్స్ తేడాతో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే భారత అభిమానులు కోహ్లీసేన ఫైనల్ కు చేరుతుందని భావించి ఫైనల్ మ్యాచ్ టికెట్లను ముందుగానే కొనుగోలు చేశారు. లార్డ్స్ మైదానంలో 30వేల కెపాసిటీ ఉంది. దాంట్లో 80 శాతం టికెట్లు భారత అభిమానులే కొన్నారట. కానీ ప్రపంచకప్ ఫైనల్ ఆతిథ్య జట్టు ఇంగ్లాండ్×న్యూజిలాండ్ జట్ల మధ్య జరగనుంది. దీంతో ఇంగ్లాండ్, కివీస్ అభిమానులు టికెట్లు కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. ఈ క్రమంలో కివీస్ ఆల్రౌండర్ జేమ్స్ నీషమ్ టికెట్ల కోసం భారత అభిమానులను అభ్యర్థించాడు.
‘ప్రియమైన భారత అభిమానుల్లారా.. మీకు ఫైనల్ మ్యాచ్ కు రావాలని లేకపోతే దయచేసి మీ టికెట్లను తిరిగి ఐసీసీ వెబ్ సైట్ లోనే అమ్మండి. ఫైనల్ మ్యాచ్ టికెట్లకు బయట మంచి డిమాండ్ ఉంటుందని నాకు తెలుసు. కానీ, నిజమైన క్రికెట్ అభిమానులు కూడా మ్యాచ్ చూడటానికి ఒక అవకాశం ఇవ్వండి.’ అంటూ ట్వీట్ చేశాడు. దీనిపై భారత అభిమానులు స్పందిస్తున్నారు. న్యూజిలాండ్ కు మద్దతు ఇస్తామని కామెంట్లు పెడుతున్నారు. సెమీస్ మ్యాచ్ తర్వాత న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్ కూడా భారత అభిమానులను ఉద్దేశించి మాట్లాడాడు. ఫైనల్లో భారత అభిమానులు కివీస్ కు మద్దతు ఇవ్వాలని కోరాడు.
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) రిటర్న్ పాలసీని తమ వెబ్ సైట్ లో చేర్చింది. దీనిలో అభిమానులు టికెట్లను తిరిగి విక్రయించొచ్చు. అలా విక్రయిస్తే 100 శాతం టికెట్ ధరని తిరిగి ఇస్తామని కూడా ప్రకటించింది. టికెట్లపై బ్లాక్ మార్కెటింగ్ జరగకూడదనే ఉద్దేశంతో ఈ తరహా పద్ధతిని ఐసీసీ పాటిస్తుంది. ఆదివారం లార్డ్స్లో ప్రపంచకప్ ఫైనల్ ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరగనుంది.