కొండంతా జనమే..భక్తులతో కిక్కిరిసిన యాదగిరిగుట్ట

కొండంతా జనమే..భక్తులతో కిక్కిరిసిన యాదగిరిగుట్ట
  • వేసవి సెలవులు ముగుస్తుండడంతో భారీ సంఖ్యలో తరలొచ్చిన భక్తులు
  • ధర్మదర్శనానికి 5, స్పెషల్‌‌ దర్శనానికి రెండున్నర గంటల టైం
  • ఆదివారం ఒక్కరోజే రూ.85.57 లక్షల ఆదాయం

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిక్కిరిసిపోయింది. మరో మూడు రోజుల్లో స్కూళ్లు రీఓపెన్‌‌ అవుతుండడంతో రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ధర్మదర్శనం, స్పెషల్‌‌దర్శనం క్యూలైన్లు, లక్ష్మీపుష్కరిణి, కల్యాణకట్ట, సత్యనారాయణస్వామి వ్రతమండపాలు, బస్‌‌బే ఏరియా, ప్రధానాలయ ప్రాంగణాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి.

రద్దీ కారణంగా స్వామి వారి ధర్మదర్శనానికి ఐదు గంటలు, స్పెషల్‌‌ దర్శనానికి రెండు గంటల టైం పట్టిందని భక్తులు తెలిపారు. ఆదివారం ఒక్కరోజే సుమారు లక్ష మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నట్లు తెలుస్తోంది. కొండపైన బస్‌‌ బే ప్రాంగణం, ప్రొటోకాల్ ఆఫీస్ పక్కన ఉన్న పార్కింగ్‌‌ ప్లేస్‌‌ కూడా నిండిపోవడంతో కొండపైకి వాహనాల రాకను నిలిపివేశారు. కొండ కింద ఉన్న పార్కింగ్‌‌ ప్లేస్‌‌లో కూడా ఇదే పరిస్థితి నెలకొనడంతో భక్తులు తమ వాహనాలను రింగు రోడ్డువెంట, వైకుంఠ ద్వారం ఏరియా, మెయిన్‌‌రోడ్డు వెంట పాతగుట్ట చౌరస్తా వరకు పార్క్‌‌ చేశారు. కొండపైకి వాహనాల నిలిపివేత కారణంగా బస్సుల్లో రద్దీ పెరిగింది. 

ఒక్కరోజే రూ.85.57 లక్షల ఆదాయం

యాదగిరిగుట్ట ఆలయానికి ఆదివారం ఒక్క రోజే రూ.85,57,558 ఆదాయం వచ్చింది. ఇందులో అత్యధికంగా ప్రసాద విక్రయం ద్వారా రూ.27,07,020 వచ్చాయి. వీఐపీ దర్శనాలతో రూ.15.60 లక్షలు, కొండపైకి వాహనాల ప్రవేశంతో రూ.8,66,500, బ్రేక్‌‌ దర్శనాల ద్వారా రూ.10,65,900, ప్రధాన బుకింగ్‌‌ ద్వారా రూ.4,79,200, సత్యనారాయణస్వామి వ్రతాల ద్వారా రూ.2,18,400, కల్యాణకట్ట ద్వారా రూ.2.04 లక్షలు, యాదరుషి నిలయం ద్వారా రూ.4,05,274, లీజుల ద్వారా రూ.5,92,360 ఇన్‌‌కం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. రద్దీ కారణంగా భక్తులు స్పెషల్, బ్రేక్ దర్శనానికి మొగ్గు చూపారు.