యాదగిరిగుట్ట దేవస్థానంలో వ్రత టికెట్‌‌‌‌‌‌‌‌ రేట్ల పెంపు

యాదగిరిగుట్ట దేవస్థానంలో వ్రత టికెట్‌‌‌‌‌‌‌‌ రేట్ల పెంపు
  • రూ.800 నుంచి రూ.1000కి పెంచుతూ ఆర్డర్స్‌‌‌‌‌‌‌‌
  • రేపటి నుంచి ఉచితంగా పులిహోరా, లడ్డూ పంపిణీ ట్రయల్స్‌‌‌‌‌‌‌‌

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో సత్యనారాయణస్వామి వ్రతాల టికెట్‌‌‌‌‌‌‌‌ రేట్లను పెంచుతూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇప్పటివరకు రూ. 800గా ఉన్న రేటును రూ. 1000కి పెంచుతూ ఈవో వెంకట్‌‌‌‌‌‌‌‌రావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. అన్నవరం తర్వాత యాదగిరిగుట్టలోనే ఎక్కువగా వ్రతాలు జరుగుతుంటాయి.

ఇప్పటివరకు ఉన్న టికెట్‌‌‌‌‌‌‌‌పై పూజా సామగ్రితో పాటు అవసరమైన పాత్రలు ఇస్తున్నారు. ఇప్పుడు రూ. టికెట్‌‌‌‌‌‌‌‌ రేటును రూ. 1000కి పెంచిన దేవస్థానం పూజా, ఇతర సామగ్రితో పాటు స్వామివారి శేష వస్త్రాలు (షెల్లా, కనుమ), సత్యనారాయణస్వామి విగ్రహ ప్రతిమ సైతం ఇవ్వనుంది. టికెట్‌‌‌‌‌‌‌‌ రేపు పెంపు నేటి నుంచే అమల్లోకి
రానుంది.

రేపటి నుంచి పులిహోరా, లడ్డూప్రసాదం పంపిణీ ట్రయల్‌‌‌‌‌‌‌‌

యాదగిరిగుట్ట నారసింహుడి దర్శనానికి వచ్చే భక్తులకు పులిహోరా, లడ్డూ ఉచితంగా పంపిణీ చేయాలని దేవస్థానం భావిస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 14 నుంచి 30 వరకు ట్రయల్‌‌‌‌‌‌‌‌ నిర్వహించనుంది. అంతా సవ్యంగా ఉంటే... జూలై ఒకటి నుంచి వారంలో ఆరు రోజులు పులిహోరా, శనివారం మాత్రం పులిహోరాతో పాటు లడ్డూ ప్రసాదాన్ని సైతం భక్తులకు ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు ఈవో తెలిపారు.

ఆలయ సర్కిళ్లకు ప్రత్యేక పేర్లు

యాదగిరికొండ చుట్టూ నిర్మించిన ఆరు లైన్ల రింగు రోడ్డుకు మధ్య మధ్యలో ఏర్పాటు చేసిన సర్కిల్స్‌‌‌‌‌‌‌‌కు నామకరణం చేశారు. వైకుంఠద్వారం వద్ద ఉన్న సర్కిల్‌‌‌‌‌‌‌‌కు అభయాంజనేయస్వామి సర్కిల్‌‌‌‌‌‌‌‌గా, మల్లాపురం వెళ్లే దారిలో కూడలికి యాదరుషి, ప్రెసిడెన్షియల్‌‌‌‌‌‌‌‌ సూట్‌‌‌‌‌‌‌‌ సర్కిల్‌‌‌‌‌‌‌‌కు గరుడ, ఘాట్‌‌‌‌‌‌‌‌ రోడ్డు కూడలికి రామానుజ సర్కిల్‌‌‌‌‌‌‌‌గా నామకరణం చేశారు.

నర్సన్నకు రూ. 4.47 కోట్ల ఆదాయం    

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామికి‌‌‌‌ హుండీల ద్వారా భారీ ఆదాయం సమకూరింది. 44 రోజులకు సంబంధించిన హుండీలను గురువారం స్థానికంగా లెక్కించారు. హుండీల ద్వారా మొత్తం రూ. 4,47,66,560 తో పాటు 115 గ్రాముల బంగారం, 6.050 కిలో వెండి వచ్చినట్లు ఈవో వెంకట్‌‌‌‌రావు తెలిపారు. అలాగే 1,623 అమెరికా డాలర్లు, 75 ఇంగ్లాండ్‌‌‌‌ పౌండ్లు, 130 నేపాల్ రూపీస్, 106 సౌదీ అరేబియా రియాల్స్, 10 సింగపూర్ డాలర్లు, 85 ఆస్ట్రేలియా డాలర్లు, 2 ఖతార్ రియాల్స్, 280 థాయ్‌‌‌‌లాండ్ భాట్, 100 ఒమన్ బైసా, 20 శ్రీలంక రూపీస్, 1 మలేషియా  రింగిట్స్, 15 యూరప్ యూరోస్‌‌‌‌తో పాటు అరబ్ ఎమిరేట్స్‌‌‌‌కు సంబంధించి 205, రష్యా కరెన్సీ 100, ఈజిప్టు కరెన్సీ 50 వచ్చినట్లు ఈవో వెల్లడించారు. గురువారం పూజలు, నిత్య కైంకర్యాల ద్వారా రూ.24,82,521 ఆదాయం సమకూరినట్లు ఆఫీసర్లు తెలిపారు.