
యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు దేవస్థానం కార్యాచరణ షురూ చేసింది. ఇందులో భాగంగా ప్రసాదం కొరత ఏర్పడకుండా ప్రసాద తయారీ కేంద్రంలో అత్యాధునికమైన రెండు కొత్త బాయిలర్లను అందుబాటులోకి తెచ్చింది. ఈ బాయిలర్లకు శనివారం ఆలయ ఈవో వెంకటరావు ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ఒక్కో బాయిలర్ ప్రతి 40 నిమిషాలకు 102 కిలోల పులిహోర ప్రసాదాన్ని తయారు చేస్తుందని తెలిపారు. ప్రసాద కొరత తలెత్తకుండా ఉండేందుకు ఈ కొత్త బాయిలర్లను తెచ్చామన్నారు.
అందుబాటులోకి అభిషేక తీర్థ సంప్రోక్షణ, అఖండ హారతి..
యాదగిరిగుట్ట దేవస్థానంలో మరో వినూత్న సేవను ఆలయ ఈవో అందుబాటులోకి తెచ్చారు. స్వామివారి దర్శించుకునే భక్తులతో అభిషేక తీర్థ సంప్రోక్షణ, అఖండ హారతి సదుపాయాన్ని శనివారం ఆరంభించారు. క్యూలైన్ల ద్వారా ప్రధానాలయంలోకి చేరుకున్న భక్తులకు అభిషేక తీర్థ జలంతో భక్తులపై సంప్రోక్షణ చేయనున్నారు. ఇందుకోసం ప్రధానాలయంలో ఎగువన ఉన్న హనుమాన్ టెంపుల్ సమీపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి అర్చకులు క్యూలైన్లలోని భక్తులపై అభిషేక తీర్థ జలంతో సంప్రోక్షణ చేయనున్నారు.