యూజర్లు ఎప్పుడూ టెక్నాలజీలో కొత్తదనాన్ని కోరుకుంటారు. వాళ్ల అవసరాలు, ఇంట్రెస్ట్ కు తగ్గట్టుగానే కొత్తకొత్త ఫీచర్స్ అప్డేట్స్ తీసుకొస్తూనే ఉంటాయి కంపెనీలు. వాటివల్ల యాప్స్, గాడ్జెట్లు, ఫోన్లను వాడడం మరింత ఈజీ అవ్వడమే కాకుండా సెక్యూరిటీ పరంగా కూడా బాగుంటుంది. ముఖ్యమైన డాక్యుమెంట్లు, ఫైళ్లను ట్రాన్స్ఫర్ చేయడానికి జీ–మెయిల్ ఉపయోగిస్తుంటారు చాలామంది. ప్రపంచంలో ప్రస్తుతం 200 కోట్లకు పైగా జీ–మెయిల్ యాక్టివ్ యూజర్లు ఉన్నారు. అయితే, కంప్యూటర్ నుంచి మెయిల్ పంపాలంటే ఇంటర్నెట్ సదుపాయం తప్పకుండా ఉండాలి. కానీ, జీ–మెయిల్ వాళ్లు తీసుకొచ్చిన కొత్త ఫీచర్తో ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండానే జీ–మెయిల్ అకౌంట్ని వాడుకోవచ్చు. దానికోసం ఏం చేయాలంటే... ముందుగా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయాలి. క్రోమ్లో mail.google.com అని సెర్చ్ చేయగానే జీ–మెయిల్ వస్తుంది. దాంట్లో సెట్టింగ్స్లోకి వెళ్తే ఆఫ్లైన్ మెయిల్ ఆప్షన్ కనిపిస్తుంది. ఆ టూల్ని ఎనేబుల్ చేసుకోవాలి. ఆ వెంటనే ‘ఆఫ్లైన్ మోడ్లో ఎన్ని రోజుల మెయిల్ డేటా కావాలి?’ అని అడుగుతుంది. కావాల్సిన డేటా తీసుకుని ‘సేవ్ ఛేంజెస్’ బటన్ నొక్కితే చాలు ఆఫ్లైన్ జీ–మెయిల్ రెడీ. అయితే ఈ ఫీచర్ ఇన్కాగ్నిటో మోడ్లో పనిచేయదు.
ట్విట్టర్లో ఆర్టికల్స్ రాయొచ్చు
ట్విట్టర్లో ఇకనుంచి ఆర్టికల్స్ కూడా రాయొచ్చు. ఇప్పటివరకు ట్విట్టర్లో ఏ పోస్ట్ అయినా 280 పదాలకు మించి రాయలేం. ఏం చెప్పాలనుకున్నా ఆ 280 పదాల్లో చెప్పాలి. అయితే ఇప్పుడు తీసుకొచ్చిన ‘ట్విట్టర్ రైట్(write)’ అనే కొత్త ఫీచర్లో పెద్ద ఆర్టికల్స్ రాయొచ్చు. అంతేకాదు ఆర్టికల్స్ మధ్యలో ఫొటోలు, వీడియోలు, జిఫ్ (గ్రాఫిక్స్ ఇంటర్ఛేంజ్ ఫార్మాట్) ఫైళ్లని కూడా పోస్ట్ చేయొచ్చు. ట్విట్టర్ ఓపెన్ చేయగానే హోమ్లో ‘రైట్’ అనే ఫీచర్ కనిపిస్తుంది. దానిలోంచి ఆర్టికల్స్ రాసి పోస్ట్ చేయొచ్చు.