దేశంలో E20 పెట్రోల్ అమ్మకాలు, దాని వల్ల వాహనాలపై పడుతున్న ప్రభావాల గురించి తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ముఖ్య ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్ మోడీ ప్రభుత్వానికి కీలక సూచన చేశారు. వాహనదారుల ఆందోళనలను తగ్గించేందుకు తక్కువ శాతం ఇథనాల్ కలిపిన E10 పెట్రోల్ను మార్కెట్లోకి తిరిగి తీసుకురావాలని సూచించారు.
దేశంలో క్రూడ్ ఆయిల్ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి, కాలుష్యాన్ని అరికట్టడానికి ఉద్దేశించిన E20 పెట్రోల్ గత ఏడాది దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టింది మోడీ సర్కార్. ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా ఉన్న పెట్రోల్ స్టేషన్లలో దీనిని మాత్రమే అమ్ముతున్నారు. అయితే ఈ మార్పు వాహనాల పనితీరుపై ప్రభావం చూపుతుందనే భయాలు ప్రజల్లో రోజురోజుకూ పెరిగిపోతున్నాయి.
వి. అనంత నాగేశ్వరన్ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఈ20తో పాటు ఈ10 వంటి తక్కువ ఇథనాల్ కలిపిన పెట్రోల్ను కూడా వినియోగదారులకు కొనుగోలు చేయడానికి మరో ప్రత్యామ్నాయంగా అందుబాటులో ఉంచితే ప్రజల్లో ఉన్న చాలా ఆందోళనలు తొలగిపోతాయని వారు స్పష్టం చేశారు. అయితే ఇవి పూర్తిగా వారి వ్యక్తిగత అభిప్రాయాలని పేర్కొన్నారు.
భారతదేశంలో సుమారు 7 కోట్ల నుంచి 8 కోట్ల వరకూ పాత ద్విచక్ర వాహనాలు ఉన్నాయని, ఎక్కువ ఇథనాల్ కలిపిన పెట్రోల్ ను తట్టుకోలేక చాలా వాటిలో పాత రబ్బరు సీల్స్ వంటి సమస్యలను వస్తున్నాయి. వీటి పరిష్కరించడానికి సంవత్సరాలు పడుతుందని ఆర్థిక వేత్త అభిప్రాయపడ్డారు. రెట్రోఫిట్టింగ్ కార్యక్రమం పూర్తయ్యే వరకు ఇప్పటికే ఉన్న వాహనాలను కాపాడాల్సిన అవసరం ఉందని సూచించారు. ఒక ప్రభుత్వ ఉన్నతాధికారి ప్రస్తుత ఈ20 పెట్రోల్ విధానానికి వ్యతిరేకంగా బహిరంగంగా ఈ విధంగా స్పందించడం ఇదే మొదటిసారి కావడం విశేషం.
ఫారెక్స్ రిజర్వ్స్ ఆదా, ఇంధన భద్రత కోసం ఈ విధానం అవసరమని ప్రభుత్వం సమర్థించుకుంటున్నప్పటికీ.. సామాన్య వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఆర్థిక వేత్తలు చేసిన ఈ సలహా ప్రస్తుతం జాతీయ స్థాయిలో చర్చకు దారితీసింది. సోషల్ మీడియాలో కూడా చాలా మంది ప్రజలు దీనిని సమర్థిస్తూ తమ గోడు పట్టించుకోవటానికి మోడీ సర్కార్ ఇకనైనా ప్రయత్నించాలని కోరుకుంటున్నారు.
