18వ జెర్సీకి 18 ఏళ్లు.. కింగ్ కోహ్లీ ప్రయాణం ఇదే

18వ జెర్సీకి 18 ఏళ్లు.. కింగ్ కోహ్లీ ప్రయాణం ఇదే

Virat Kohli: 2008 ఆగస్టు 18న శ్రీలంకలోని దంబుల్లా వేదికగా 19 ఏళ్ల రఫ్ అండ్ టఫ్ కుర్రాడు విరాట్ కోహ్లీ టీమిండియా బ్లూ జెర్సీలో తొలిసారి అంతర్జాతీయ మైదానంలోకి ఎంట్రీ ఇచ్చాడు. అంతకు ముందే 2008 అండర్-19 వరల్డ్ కప్ కొట్టి కెప్టెన్‌గా రచ్చ లేపిన కోహ్లీ, సీనియర్ వన్డే అరంగేట్రంలో ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. ఆ మ్యాచ్‌లో 22 బంతుల్లో 33 నిమిషాలు క్రీజులో ఉండి 12 రన్స్ చేసి నువాన్ కులశేఖర బౌలింగ్‌లో అవుటయ్యాడు. ఎంఎస్ ధోనీ నాయకత్వంలోని భారత్ ఆ మ్యాచ్‌లో 146 పరుగులకే ఆలౌటైంది. ఇక లంక 8 వికెట్ల తేడాతో గెలిచింది. కానీ, ఆరోజు దంబుల్లాలో మొదలైన 18వ నంబర్ జెర్సీ ప్రస్థానం.. ఆ తర్వాతి కాలంలో ప్రపంచ క్రికెట్ హిస్టరీనే తిరగరాసింది. 2009లో శ్రీలంకపైనే తొలి వన్డే సెంచరీ కొట్టి తానెంటో నిరూపించుకున్నాడు. 

మ్యాచ్ ఏదైనా ఛేజింగ్ కింగ్ దే: 

మైదానంలో కోహ్లీ దిగాడంటే ప్రత్యర్థి బౌలర్లకు పూనకాలే. 2012 ఆసియా కప్‌లో పాకిస్థాన్‌పై కొట్టిన 183 పరుగుల సంచలన ఇన్నింగ్స్ ఇప్పటికీ ఒక క్లాసిక్ ఇన్సింగ్స్ గా నిలిచిపోయింది. టార్గెట్ ఎంత పెద్దదైనా, కొండంత ఒత్తిడి ఉన్నా క్యాలిక్యులేటెడ్ మైండ్ సెట్‌తో మ్యాచ్‌లను సింగిల్ హ్యాండ్‌తో గెలిపించి చేజ్ మాస్టర్ గా కిరీటం దక్కించుకున్నాడు.

* ట్రోఫీల వేట: 2011 వన్డే వరల్డ్ కప్, 2013 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ అందుకున్న జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. 

* దశాబ్దపు హీరో: 2011–2020 దశాబ్దానికి గానూ ఐసీసీ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ది డికేడ్ పురస్కారాన్ని అందుకున్నాడు. 

* సచిన్ రికార్డ్ బ్రేక్: 2023 వన్డే ప్రపంచకప్‌లో ఏకంగా 765 పరుగులు కొట్టిన కోహ్లీ, న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్లో తన 50వ వన్డే సెంచరీ పూర్తి చేసి, క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టి చరిత్ర సృష్టించాడు.

ఆసీస్ గడ్డపై రచ్చ లేపిన కెప్టెన్సీ: 

పరిమిత ఓవర్ల క్రికెట్‌లోనే కాకుండా టెస్టుల్లోనూ భారత్‌ను తిరుగులేని శక్తిగా మార్చాడు కోహ్లీ. కెప్టెన్‌గా 2018–19లో ఆస్ట్రేలియా గడ్డపై భారత్‌కు చారిత్రాత్మక టెస్టు సిరీస్ విజయాన్ని అందించడమే కాకుండా, జట్టులో కఠినమైన ఫిట్‌నెస్ సంస్కృతిని తీసుకొచ్చాడు. కొంతకాలం ఫామ్ లేమితో ఇబ్బంది పడినా, 2022 ఆసియా కప్‌లో తొలి టీ20 సెంచరీతో ఘనంగా పునరాగమనం చేశాడు. అదే ఏడు టీ20 వరల్డ్ కప్‌లో మెల్‌బోర్న్ (MCG) వేదికగా పాకిస్థాన్‌పై కొట్టిన 82* నాటౌట్ ఇన్నింగ్స్ క్రికెట్ చరిత్రలోనే ఒక ఐకానిక్ వండర్ గా నిలిచింది. ఇక 2024 టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో సౌతాఫ్రికాపై 76 రన్స్ చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకుని టీమిండియాకు ట్రోఫీ అందించాడు.

టార్గెట్ 2027 వన్డే వరల్డ్ కప్ ట్రోఫీ కొట్టడమే:  

* 2024 టీ20 వరల్డ్ కప్ ట్రోఫీ గెలిచిన మరుక్షణమే టీ20 అంతర్జాతీయ క్రికెట్‌కు, ఆ తర్వాతి కాలంలో సుదీర్ఘమైన వర్క్‌లోడ్ తగ్గించుకోవడానికి టెస్టులకు కూడా గుడ్ బై చెప్పేసి, తన పూర్తి ఫోకస్‌ను 50 ఓవర్ల వన్డే ఫార్మాట్ వైపే మళ్లించాడు. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియాలలో జరగనున్న 2027 వన్డే ప్రపంచకప్ లో భారత్‌ను విజేతగా నిలపడమే కోహ్లీ ప్రధాన టార్గెట్ గా పెట్టుకున్నాడు. 

* జిమ్ వర్కౌట్స్, ఆహారపు అలవాట్లను కేవలం మ్యాచ్‌ల కోసమే కాకుండా ఒక జీవనశైలిగా మార్చుకున్న కోహ్లీ, 18 ఏళ్ల క్రితం తన మొదటి మ్యాచ్‌లో ఎంత ఆకలితో ఆడాడో, అదే పరుగుల దాహంతో 2027 వరల్డ్ కప్ కోసం శిక్షణ పొందుతున్నాడు. ఆగస్టు 18న కేవలం 12 పరుగులతో మొదలైన జెర్సీ నంబర్ 18 ప్రయాణం, ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అభిమానులకు ఒక గొప్ప ప్రేరణగా నిలిచింది.