హైదరాబాద్ శివారులో దారుణం జరిగింది. మొయినాబాద్ కేతిరెడ్డిపల్లి గ్రామంలో స్వప్న (34) అనే యువ న్యాయవాది హత్యకు గురవడం స్థానికంగా కలకలం రేపుతోంది. స్వప్ను దుండగులు గొంతుకోసి హత్య చేసినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు హత్యకు గురైన స్వప్న మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈ సంఘటనపై న్యాయవాదుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ దారుణ హత్యను నిరసిస్తూ చేవెళ్ల కోర్టును న్యాయవాదులు బైకాట్ చేశారు. న్యాయవాదుల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. న్యాయవాదికే న్యాయం లేకపోతే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? అంటూ న్యాయవాదులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్వప్న హత్యకు కారణమైన వారిని పట్టుకుని నిందితులకు శిక్షపడేలా చేయాలని డిమాండ్ చేశారు. న్యాయవాది స్వప్న కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు.
