హైదరాబాద్: నగరంలోని చందానగర్ పోలీస్స్టేషన్ పరిధిలో విషాదం జరిగింది. స్థానిక రాజీవ్ స్వగృహలో నివాసం ఉంటున్న పూజ అంబికా(21) అనే యువతి అపార్ట్మెంట్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. బీటెక్ చదువుతున్న పూజ.. ఓ ఆన్లైన్ ట్రేడింగ్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్ గా పార్ట్ టైమ్ జాబ్ చేస్తోంది. అయితే ఈ గురువారం ఉదయం 5.30 గంటలకు తాను ఉంటున్న అపార్ట్మెంట్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు గల కారణం తెలియాల్సి ఉంది.
ఆమె తల్లిదండ్రులు టైలరింగ్ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఓ వైపు చదువుకుంటూనే కుటుంబానికి చేదోడువాదోడుగా నిలుస్తున్న పూజా మృతి పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె మృతి చెందిన విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.