హసన్ సఫిన్.. వయసు 22 ఏళ్లు. అంత చిన్న వయసులోనే ఐపీఎస్గా ఎంపికయ్యాడు. దేశంలో యంగెస్ట్ ఐపీఎస్గా రికార్డు కొట్టేశాడు. డిసెంబర్ 23న గుజరాత్లోని జామ్నగర్ సిటీకి ఏఎస్పీగా బాధ్యతలు తీసుకోబోతున్నాడు. అయితే, అతడి విజయం వెనక ఎన్నో కష్టాలున్నాయి. అమ్మానాన్నలు ముస్తఫా హసన్, నసీంబానులు ఓ డైమండ్ ఫ్యాక్టరీలో కార్మికులుగా పనిచేస్తున్నారు. వాళ్లు అంత పనిచేసినా కుటుంబం గడవడం కష్టంగానే ఉండేది. దీంతో వాళ్ల పిల్లల చదువులూ గందరగోళంలో పడిన పరిస్థితి వాళ్లది. అయినా, వేరే ఖర్చులు తగ్గించి సఫిన్ చదువుపైనే అతడి అమ్మానాన్నలు ఎక్కువగా ఖర్చు చేశారు. ఖర్చుల కోసం అతడి అమ్మ నసీంబాను పెళ్లిళ్లు, రెస్టారెంట్లలో చపాతీలు చేసేది. ఆ వచ్చిన అదనపు ఆదాయాన్నీ సఫిన్ చదువు కోసమే పెట్టారు అతడి తల్లిదండ్రులు. ఇప్పుడు వాళ్ల కష్టానికి తగిన ప్రతిఫలాన్ని సఫిన్ సాధించి చూపించాడు. అతడి ట్యాలెంట్ను చూసి స్థానికంగా ఉండే కొందరు వ్యాపారవేత్తలూ సఫిన్ చదువుకు డబ్బు సాయం చేశారు. అతడి కల సాకారమయ్యేలా చూశారు.
ఐఏఎస్ అవుదామనుకున్నాడు
సఫిన్ వాళ్లుండేది గుజరాత్లోని పాలంపూర్ జిల్లాలో ఉన్న కనోదర్ అనే చిన్న ఊర్లో. పోయిన సంవత్సరం జరిగిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఎగ్జామ్లో ఆలిండియా లెవెల్లో 570వ ర్యాంకు సాధించాడు సఫిన్. ఐపీఎస్గా సెలెక్ట్ అయ్యాడు. కానీ, ఐఏఎస్ కావాలన్నది అతడి కల. దీంతో మరోసారి పరీక్ష రాశాడు. కానీ, ఐఏఎస్ సాధించలేకపోయాడు. కుటుంబ పరిస్థితుల గురించి ఆలోచించి ఐపీఎస్ ఆఫీసర్గా దేశానికి సేవ చేసేందుకే నిర్ణయించుకున్నాడు సఫిన్.