వడ్లు కొనడం చేతకాక ధర్నాలు చేస్తున్నారు

వడ్లు కొనడం చేతకాక ధర్నాలు చేస్తున్నారు

రైతు సమస్యలపై వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పోరుబాట పట్టారు. యాసంగిలో ధాన్యం కొనుగోలు చేసేదిలేదన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నాచౌక్‎లో ఆమె 72 గంటల రైతు వేదన దీక్ష చేపట్టారు. సాయంత్రం 6 వరకు షర్మిల దీక్ష చేయనున్నారు. ఆ తర్వాత లోటస్ పాండ్‎లో దీక్షకు కూర్చొనున్నారు. అందుకోసం ఆ పార్టీ నేతలు ఏర్పాట్లు కూడా చేశారు. 

రైతులు పండించిన చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు షర్మిల ఇప్పటికే ప్రజాప్రస్థాన పాదయాత్ర చేస్తున్నారు. గత 21 రోజుల నుంచి ఆరు నియోజకవర్గాల్లో పాదయాత్ర చేశారు. అందులో భాగంగా 150 గ్రామాలను సందర్శించిన షర్మిల.. అన్ని వర్గాల ప్రజల సమస్యలు విన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వల్ల యాత్రకు బ్రేక్ పడటంతో ఇప్పుడు రైతుల సమస్యలపై పోరాటం చేస్తున్నారు. యాసంగిలో వరి వేయడంపై, ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును నిరసిస్తూ.. ఆందోళనలో ఉన్న రైతులకు అండగా ఉండేందుకు ఆమె ఈ రైతు వేదన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు.


‘వరి కోనుగోలు విషయంలో బీజేపీ, కేసీఆర్ ఒకరిపై ఒకరు నెపం వేస్తూ.. అన్నదాతలకు సున్నం పెడుతున్నారు. 

వడ్ల కుప్పలమీదే రైతులు చనిపోతున్నా కేసీఆర్‎లో చలనం లేదు. 

వడ్లు కొనడంలో కేసీఆర్‎కు ఉన్న ఇబ్బందేంటి? కేసీఆర్ 

కేంద్రానికి ఏజెంట్‎గా ఎందుకు మారారో సమాధానం చెప్పాలి. 

కేంద్రం విధించే ఆంక్షలపై ఎందుకు సంతకాలు పెట్టారు. 

ఆంక్షలు పెట్టినరోజే ఢిల్లీలోనే ధర్నాలు, ప్రెస్ మీట్లు పెట్టాలి కదా. అది చేతకాక ఇక్కడ ధర్నాలు చేస్తారా? 

మీరు చేసే ధర్నాల వల్ల ఎవరికి ఉపయోగం? 

వడ్లు కొనడం చేతకాక ధర్నాలు చేస్తున్నారు. 

20 శాతం బోనస్ ఇచ్చిమరీ వడ్లు కొన్న ఘనత వైఎస్సార్ కే దక్కుతుంది. 

పక్క రాష్ట్రాలు ఎమ్మెస్పీపై బోనస్ ఇచ్చి ధాన్యం సేకరిస్తుంటే.. కేసీఆర్ కనీసం మద్దతు ధర కూడా ఇవ్వడం లేదు. 

పక్క రాష్ట్రాల ప్రభుత్వాలకు రైతులపై ఉన్న చిత్తశుద్ధి.. కేసీఆర్‎కు ఎందుకు లేదు? 

భారం మొత్తం రైతులపై మోపి తప్పించుకునే ప్రయత్నం చేయడం సమంజసం కాదు. 

రైస్ ఎక్కడ అమ్మాలి, వాటిని ఏం చేసుకుంటారనేది ప్రభుత్వాలు చూసుకోవాల్సింది. 

రైతు పండించిన పంట కొనడం ముమ్మాటికీ ప్రభుత్వ విధి. 

దేశంలో ఆహారకొరత ఏర్పడితే ఆదుకునేది వరి పండించిన రైతులే కదా. వడ్లు కొనమని 

మీ కాళ్లుపట్టుకొని బతిమలాడే స్థితికి తీసుకొచ్చారు. 

మిల్లర్లకు మేలు చేయాలనే కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు. 

రైతు నష్టపోవాలని, మిల్లర్లు లాభపడాలనే కేసీఆర్ వడ్లు కొనడం లేదు. కేసీఆర్‎కు నిజాయితీ ఉంటె సివిల్ సప్లె అడిట్ రిపోర్ట్ బయటపెట్టాలి. 

నియంత్రిత వ్యవసాయం మీద పెట్టె శ్రద్ధ.. మద్యం, డ్రగ్స్ పై పెడితే రాష్ట్రం బాగుపడుతుంది. 

డ్రగ్స్ సంస్కృతి జిల్లాలకు కూడా పాకింది. ఆ పాపం కెసిఆర్‎దే. 

ప్రజల గొంతు నొక్కేయాలని, ధర్నా చౌక్ మూసేయాలని చూసిన కేసీఆర్‎కు మళ్ళీ అదే వేదిక దిక్కయింది. 

మీకు పాలన చేతకాక ధర్నాలు చేస్తున్నారు. 

36 లక్షల మంది రైతులకు రుణమాఫీ ఎగ్గొట్టిన మోసగాడు కేసీఆర్. 

పంట బీమా, ఇన్పుట్ సబ్సిడీ లేదు. 

రైతుబంధు పేరిట నాలుగు వేలు ఇస్తూ.. 24 వేలు ఎగ్గొట్టారు. 

వడ్లు ఎవరో కొంటె.. మీ బోడి పెత్తనం ఏంది? 

కేంద్రం పెత్తనం ఏంటి? ఆఖరి గింజ కొంటామని కేసీఆర్ మాట ఇచ్చారు. 

ఆఖరి గింజ వరకు కేసీఆర్ కొనాల్సిందే. 

ధాన్యం కొనగోలు విషయంలో కేంద్రం 

మెడలు వంచుతామని చెప్పిన కేసీఆర్.. ఇప్పుడెందుకు వంచలేకపోతున్నారు. 
వాళ్ళ మెడలేమైనా లావు అయ్యాయా లేక మీ చేతులు సన్నగా అయ్యాయా? 

వరి వేయవద్దని చెప్పేందుకే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారా? 

లేక కమీషన్ల కోసం కట్టారా? 

ఉచిత ఎరువుల హామీ ఇంకెప్పుడు అమలు చేస్తావు? 

యంత్ర లక్ష్మి పథకం ద్వారా ఒక్కరికైనా యంత్రాలు ఇచ్చారా? 
కేసీఆర్ రైతు వ్యతిరేకి. 

ఖమ్మంలో రైతులకు బేడీలు వేసిన చరిత్ర కేసీఆర్‎ది. 

పంట మార్చుకోవడం బట్టలు మార్చుకున్నంత సులభమా? మంత్రులను మార్చినంత సులభమా?
 
భూముల్లో నచ్చిన పంట వేసుకొనే స్వేచ్ఛ కూడా రైతులకు లేదా? 

ఇతర పంటలు వేసుకునే భరోసా కలిగించేంత వరకు కేసీఆర్ వడ్లు కొనాల్సిందే. 

వైఎస్సార్ సంక్షేమ పాలనలో రైతే రాజు, వ్యవసాయం పండుగ. 

రైతును రాజును చేసేందుకే 72 గంటలపాటు దీక్ష చేస్తున్నా’ అని షర్మిల అన్నారు.