దొర చేసిన అప్పులకు రాష్ట్ర ఆదాయం కిస్తీలకే సాల్తలేదు : షర్మిల

దొర చేసిన అప్పులకు రాష్ట్ర ఆదాయం కిస్తీలకే సాల్తలేదు : షర్మిల

రాష్ట్ర పరిస్థితి పైన పటారం.. లోన లోటారం అన్నట్లుగా ఉందని వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శించారు. దొర చేసిన అప్పులకు రాష్ట్ర ఆదాయం వడ్డీలకే సరిపోతుందని అన్నారు. రూ. 16వేల కోట్ల మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని రూ. 4.50లక్షల కోట్లు అప్పులమయంగా మార్చారని ఆరోపించారు. దొర చేసిన అప్పులకు ఎనిమిదిన్నర ఏళ్లలో లక్ష కోట్ల వడ్డీలు కట్టారని మండిపడ్డారు. ఇంత అప్పు చేసినా జనానికి ఒరిగింది మాత్రం సున్నా అని షర్మిల అన్నారు. ‘‘ఆరోగ్య శ్రీకి డబ్బుల్లేవ్.. ఫీజు రీయింబర్స్మెంట్కు పైసల్ లేవ్.. ఏ పథకానికి నిధుల్లేవ్.. ఆఖరికి ఉద్యోగుల జీతాలకు కూడా అతీగతీ లేదు. తిన్నది కల్వకుంట్ల కుటుంబం.. కట్టేది జనం. మీరు చేసిన దానికి ప్రజలు ఎందుకు వడ్డీలు కట్టాలి" అని మండిపడ్డారు.

ధనిక రాష్ట్రం అంటూనే జనాలను కేసీఆర్ జలగల్లా పీల్చుకు తింటున్నారని షర్మిల మండిపడ్డారు. చక్ర వడ్డీలతో చక్రం తిప్పి, ఒక్కో నెత్తిన లక్షన్నర అప్పు పెట్టి, రాష్ట్రాన్ని అప్పులకుప్ప చేశారన్నారు. బంగారు తెలంగాణ చేశానని, ఇక బంగారు భారత్ చేస్తానంటూ దేశాన్ని దోచుకోడానికి వెళ్తున్నారని ఆరోపించారు.