కేంద్ర ఉద్యోగులకు డీఏ 28 శాతానికి పెంపు 

 కేంద్ర ఉద్యోగులకు డీఏ 28 శాతానికి పెంపు 

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభ వార్త. డీఏ 11 శాతం పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ప్రస్తుతం 17 శాతం ఉన్న డీఏను 28 శాతానికి పెంచాలని నిర్ణయించింది. బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో 7వ పే కమిషన్ సిఫారసులపై చర్చ జరిగింది. కరోనా మహమ్మారి వ్యాప్తి.. లాక్ డౌన్ కారణంగా  కేంద్ర ఉద్యోగులకు గత ఏడాది అంటే 2020 జనవరి నుంచి డీఏ పెంపు పెండింగ్ లో ఉండిపోయింది. ఇప్పటి వరకు మూడు డీఏలు పెండింగ్ లో ఉండిపోయాయి. మరో వైపు 2021 జులై నుంచి కొత్త డీఏ అమలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపధ్యంలో మోడీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో డీఏ పెంపు పట్ల కేబినెట్ సానుకూలం వ్యక్తం చేసి 11 శాతం పెంపునకు ఒప్పుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. కేబినెట్ భేటీలో నిర్ణయాలను కేంద్ర మంత్రులు మరికాసేపట్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.