ఇద్దరు పిల్లలను చంపి గొంతు కోసుకున్న తల్లి

ఇద్దరు పిల్లలను చంపి గొంతు కోసుకున్న తల్లి
  • ప్రకాశం జిల్లా పొదిలి మండలం ఉప్పలపాడులో ఘటన
  • భర్తతో కొట్లాడి దారుణానికి ఒడిగట్టిన తల్లి ఆదిలక్ష్మి
  • బాధతో ఆర్తనాదాలు చేయడంతో గుర్తించిన ఇరుగు పొరుగు
  • ఆసుపత్రికి తరలిస్తుండగా చిన్నారులిద్దరూ మార్గం మధ్యలోనే మృతి
  • తీవ్రరక్తస్రావం కావడంతో తల్లి పరిస్థితి విషమం

ప్రకాశం జిల్లా: భార్యా భర్తల గొడవ అభం శుభం ఎరుగని రెండు నిండు ప్రాణాలను బలి తీసుకుంది. భర్తపై కోపంతో  పిల్లల గొంతు కోసి తాను కోసుకున్న భార్య పరిస్థితి కూడా విషమంగా ఉంది. ఇంత దారుణానికి ఒడిగట్టిన భార్య వయసు పాతికేళ్లు కూడా మించలేదు. క్షణికావేశంలో జరిగిన ఘటన సంచలనం రేపింది.  ప్రకాశం జిల్లా పొదిలి మండలం ఉప్పలపాడు గ్రామంలో జరిగిన ఘటన బలహీనమవుతున్న కుటుంబ బంధాలకు నిలువెత్తు నిదర్శనంలా నిలిచింది. దారుణమైన ఘటన మీడియా ద్వారా దావానలంలా వ్యాపించడం కలకలం రేపింది. 
పోలీసులు, స్థానికుల సమాచారం చెబుతున్న ప్రకారం గ్రామానికి చెందిన రంగయ్య, రమణమ్మల కుమార్తె ఆదిలక్ష్మి (25)కి ఐదేళ్ల క్రితం సింగరాయకొండకు చెందిన వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు. కొద్ది రోజులుగా భార్యా భర్తలిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. కోపంతో 20 రోజుల క్రితం ఆదిలక్ష్మి పుట్టింటికి వెళ్లిపోయింది. ఇద్దరు పిల్లలతో తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. సోమవారం మధ్యాహ్నం భర్తతో ఫోన్లో మాట్లాడగా మాటామాటా పెరిగింది. దీంతో కోపోద్రికురాలైన ఆదిలక్ష్మి కత్తి తీసుకుని తన ఇద్దరు పిల్లలు (మూడేళ్లు, ఒక ఏడాది) గొంతు కోసింది. ఆ తర్వాత తాను గొంతు కోసుకుంది.  తీవ్ర రక్తస్రావం కావడంతో నొప్పి భరించలేక బాధతో ఆర్తనాదాలు చేశారు. దీంతో కుటుంబ సభ్యులు, ఇరుగు పొరుగు గుర్తించి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గం మధ్యలోనే ఇద్దరు చిన్నారులు చనిపోయారు. ఆదిలక్ష్మిని ఒంగోలు ఆసుపత్రికి తరలించగా.. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.