చంద్రబాబు అండ్ ​కో ది పెత్తందారి మనస్తత్వం : సీఎం జగన్

చంద్రబాబు అండ్ ​కో ది పెత్తందారి మనస్తత్వం : సీఎం జగన్
  • వ్యాన్​ చూసుకుని పవన్​ కళ్యాణ్​ మురిసిపోతున్నారు
  • చంద్రబాబు అండ్​ కో ది పెత్తందారి మనస్తత్వం ​

ఏపీలోని అన్ని నియోజకవర్గాల్లో నిలబడటానికి అభ్యర్థి కూడా లేని టీడీపీ తమకు ప్రత్యర్థా అని ఏపీ సీఎం వైఎస్​ జగన్ అన్నారు.  కృష్ణా జిల్లా గుడివాడ శివారులో ఇళ్ల నిర్మాణం, మల్లాయపాలెంలో అతి పెద్ద హౌసింగ్ క్లస్టర్ ప్రారంభోత్సవంలో సీఎం మాట్లాడుతూ..  గుడివాడ నియోజవర్గానికి మాజీ దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్​ని వెన్నుపోటు పొడిచిన అల్లుడు ఉన్నారని విమర్శించారు. చంద్రబాబు, పవన్​ కళ్యాణ్​ది పెత్తందారుల మనస్తత్వం అని అన్నారు. 30 ఏళ్లు చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు పేదల గురించి ఎన్నడూ ఆలోచించలేదని అన్నారు.  తనను ఎవరు ఆపుతారో చూస్తానంటున్న ప్యాకేజీ స్టార్​ఒక పక్క, పేదలకు మంచి చేయని చంద్రబాబు మరోపక్క ఉన్నారని మళ్లీ వీరు ప్రజలను దోచుకోవడానికి వస్తున్నారని, వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలని ప్రజలను కోరారు.  గుడివాడలో  చంద్రబాబు నాయుడు ఒక్క సెంటు స్థలం, ఇళ్లు పేదలకు ఇవ్వలేదని విమర్శించారు.

రూ.7 లక్షల విలువైన ఆస్తి..

గుడివాడలో టిడ్కో ఇళ్ల ద్వారా ప్రతి లబ్ధిదారుడికి రూ.7 లక్షల ఆస్తిని ఉచితంగా ఇచ్చిన్నట్లు సీఎం జగన్​ తెలిపారు. 8,659 ఇళ్లకు అదనంగా జూలై 7న మరో 4,200 ఇళ్లు మంజూరు చేయనున్నట్లు చెప్పారు. రాష్ర్టంలోని 30.68 లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశామని, 17 వేల జగనన్న కాలనీలు నిర్మాణంలో ఉన్నట్లు వెల్లడించారు. ఆయా ప్రాంతాల్లో ప్రతి లబ్ధిదారుడికి ఇచ్చిన ఇంటి స్థలం విలువ రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఉంటుందని చెప్పారు.  ప్రభుత్వం జగనన్న కాలనీల్లో భాగంగా నిర్మిస్తోంది ఇళ్లు కాదనీ, ఊళ్లు కడుతున్నట్లు పేర్కొన్నారు. గుడివాడ జగనన్న కాలనీల్లో 16, 420 కుటుంబాలు నివసించబోతున్నట్లు వెల్లడించారు. నియోజకవర్గంలో 13,410 మందికి పట్టాలిచ్చినట్లు చెప్పారు.