
- రెండు గిన్నిస్ వరల్డ్ రికార్డులు సృష్టించినట్టు సర్కారు ప్రకటన
లక్నో: ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో యోగి సర్కార్ ఆధ్వర్యంలో జరిగిన తొమ్మిదో ఎడిషన్ దీపోత్సవ వేడుక కన్నులపండువగా సాగింది. సరయూ నదీ తీరం వెంబడి ఈ ఏడాది 26,17, 215 దీపాలు వెలిగించారు. అదేవిధంగా ఏకకాలంలో 2,128 మందితో హారతి నిర్వహించారు. ఈ రెండూ గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కినట్టు యూపీ ప్రభుత్వం వెల్లడించింది.
ఈ మేరకు గిన్నిస్ బుక్ ప్రతినిధులు ఈ రికార్డును అధికారికంగా ధ్రువీకరించారు. అనంతరం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జైవీర్ సింగ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అమృత్ అభిజత్ కు గిన్నిస్ వరల్డ్ సర్టిఫికెట్ ను అందజేశారు. ఈ సందర్భంగా సరయూ నదీ తీరంలోని ఘాట్ లు పెద్దెత్తున భక్తులతో కిటకిటలాడాయి. దీపోత్సవంలో భాగంగా సీఎం యోగి ఆదిత్యనాథ్.. శ్రీరాముడు, సీత, లక్ష్మణుల వేషధారణలో కళాకారులకు హారతి ఇచ్చి పుష్పక విమాన రథాన్ని లాగారు. ఈ ప్రత్యేక రామ్ లీలా ప్రదర్శనలో ఐదు దేశాలకు చెందిన కళాకారులు పాల్గొన్నారు. లేజర్ షో, లైట్ షో కూడా ఆకట్టుకున్నాయి.