బిగ్ బాస్ బ్యూటీ అషురెడ్డి ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. నిన్నమొన్నటి వరకు బోల్డ్ ఇంటర్వ్యూలు, గ్లామర్ షోతో రచ్చ చేసిన ఈ బ్యూటీ.. ఇటీవల ఏకంగా రూ. 9.5 కోట్ల భారీ మోసం కేసులో ఇరుక్కుని హాట్ టాపిక్గా మారింది. ఈ వివాదం ఒక కొలిక్కి రాకముందే, లేటెస్ట్ గా ఆమె షేర్ చేసిన నిశ్చితార్థం ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
సీక్రెట్ ఎంగేజ్మెంట్..?
అషురెడ్డి తన ఇన్స్టాగ్రామ్లో కొన్ని బ్లాక్ అండ్ వైట్ ఫొటోలను పంచుకుంది. అందులో సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతూ, చేతికి ఉన్న ఎంగేజ్మెంట్ రింగ్ను చూసుకుంటున్న ఫొటో ఒకటి ఉంది. ఒక అబ్బాయి చేతిని గట్టిగా పట్టుకుని రింగ్ చూపిస్తున్న ఫొటో మరొకటి. అయితే, ఆ అబ్బాయి ముఖం కానీ, వివరాలు కానీ బయటపెట్టకుండా కేవలం కెమెరా ఎమోజీ మాత్రమే క్యాప్షన్గా పెట్టింది. దీంతో నిజంగానే నిశ్చితార్థం జరిగిందా? లేక ఏదైనా వెబ్ సిరీస్ లేదా ప్రమోషనల్ షూటింగా? అంటూ నెటిజన్లు బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
పెళ్లి పేరుతో ఎన్నారైకి టోకరా..
లండన్కు చెందిన ఎన్నారై ధర్మేంద్రను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, అషురెడ్డి ఆమె కుటుంబ సభ్యులు కలిసి ఏకంగా రూ. 9.5 కోట్లు వసూలు చేశారని ధర్మేంద్ర తండ్రి సత్యనారాయణ హైదరాబాద్ సీసీఎస్లో ఫిర్యాదు చేశారు. ఈ కేసును కొట్టేయాలని అషురెడ్డి హైకోర్టును ఆశ్రయించినా కోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరించింది. ఇంతలోనే ఈ కేసుపై అషురెడ్డి మాట్లాడిన కొన్ని ఆడియో రికార్డింగ్లు బయటపడటం సంచలనం రేపింది. ప్రస్తుతానికి రూ. 1.5 కోట్లు ఇస్తాను.. మిగిలిన డబ్బు లైఫ్లో సెటిల్ అయ్యాక ఇస్తా. ఒకవేళ ఒప్పుకోకపోతే ఫేక్ వేధింపుల కేసులు పెడతా అంటూ అషు బెదిరించినట్లు ఆ ఆడియోల ద్వారా తెలుస్తోంది.
పోలీసుల షాక్..
ఓవైపు ఎంగేజ్మెంట్ ఫొటోలతో అషురెడ్డి హడావుడి చేస్తుంటే.. మరోవైపు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు ఆమెకు గట్టి షాకిచ్చారు. అషురెడ్డితో పాటు ఆమె తల్లిదండ్రులకు 41A నోటీసులు జారీ చేశారు. వచ్చే సోమవారం ఖచ్చితంగా విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. అసలు ఈ కేసు విచారణలో ఎలాంటి నిజాలు బయటపడతాయి? వివాదాల మధ్య అషురెడ్డి వేలికి ఉంగరం తొడిగిన ఆ మిస్టరీ మ్యాన్ ఎవరు? అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే మరి.
