
ఈడీ అరెస్ట్, విచారణపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ కవిత. తనపై అక్రమంగా కేసు పెట్టారని ఆరోపించారు. కుట్రపూరితంగా లిక్కర్ స్కాంలో ఇరికిస్తున్నారని మండిపడ్డారు. విచారణలో ఏడాది క్రితం అడిగిన ప్రశ్నలనే ఇప్పుడు అడుగుతున్నారని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇన్ని అరెస్టులు చేయడం సరికాదన్నారు. దీనిపై న్యాయస్థానంలో పోరాడుతామన్నారు కవిత. ఎన్ని కుట్రలు చేసినా నిజమే గెలుస్తుందన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలని చెప్పారు.ఈ అరెస్ట్ ల మీద ఈసీ దృష్టి సారించాలన్నారు. కోర్టు నుంచి బయటకు వెళ్లే సమయంలో కవిత ఈ వ్యాఖ్యలు చేశారు.
మరో వైపు కవిత కస్టడీని.. మరో మూడు రోజులు పొడిగించింది కోర్టు. కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత.. ఇద్దరినీ కలిపి విచారించాల్సిన అవసరం ఉందని.. కస్టడీ పొడిగించాలంటూ పిటీషన్ దాఖలు చేసింది ఈడీ. ఈ వాదనలతో ఏకీభవించిన కోర్టు.. కవిత కస్టడీని మరో మూడు రోజులు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2024, మార్చి 23వ తేదీతో కవిత కస్టడీ ముగుస్తుంది. ఈ క్రమంలోనే పొడిగింపు కోసం పిటీషన్ దాఖలు చేసింది ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్. ఐదు రోజుల కస్టడీ కోరగా.. మూడు రోజుల కస్టడీ పొడిగిస్తూ.. కోర్టు ఆదేశాలు జారీ చేసింది.