టెహ్రాన్: అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రరూపం దాల్చాయి. ఇరుదేశాలు దాడులు, ప్రతీదాడులతో విరుచుకుపడుతుండంతో పశ్చిమాసియా మళ్లీ భగ్గుమంటోంది. అమెరికా దాడులకు నిరసనగా ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. ఈ క్రమంలో హార్మూజ్ జలసంధిపై అమెరికా సంచలన ప్రకటన చేసింది.
హార్మూజ్ జలసంధి తెరిచే ఉందని.. చట్టబద్ధంగా ప్రయాణించే నౌకలు దీనిని సాఫీగా దాటొచ్చని అమెరికా తెలిపింది. హార్మూజ్లో ప్రయాణించే నౌకలపై ఇరాన్ దాడుల నుంచి రక్షణ కల్పించేందుకు తమ సేనలు సిద్ధంగా ఉన్నాయని హామీ ఇచ్చింది. హార్ముజ్ను కంట్రోల్ చేసే హక్కు ఇరాన్కు లేదని తేల్చిచెప్పింది.
ఓ వైపు హార్మూజ్ జలసంధిని మూసివేసినట్లు ఇరాన్.. మరోవైపు హార్మూ్జ్ తెరిచే ఉంటుందన్న అమెరికా పరస్పర విరుద్ధ ప్రకటనలతో ప్రపంచ దేశాల్లో గందరగోళం నెలకొంది. అమెరికా, ఇరాన్ దాడులతో ఈ జలసంధిలో నౌకయానానికి మళ్లీ ఆటంకం ఏర్పడింది. ఈ జలసంధి గుండా ప్రయాణించే నౌకలపై ఇరాన్ దళాలు దాడులు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే భారత నౌవికులతో వెళ్తున్న ఓ వాణిజ్య నౌకపైన ఇరాన్ అటాక్ చేసింది.
ఈ ఘటనలో 10 మంది ప్రాణాలతో బయటపడగా.. ఒకరు తప్పిపోయారు. ఈ ఘటనపై ఇండియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెరికా, ఇరాన్ దౌత్య చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించింది. అంతర్జాతీయ జలాల గుండా వెళ్లే నౌకలపై దాడులు చేయడం సరికాదని ఇరాన్కు చురకలంటించింది. అంతర్జాతీయ జలాల్లో నౌకయానానికి ఎలాంటి ఇబ్బందులు కలిగించకూడదని హితవు పలికింది.
