డ్రగ్స్ కేసులో నిందితుడు కెల్విన్ ను ప్రశ్నిస్తున్న ఈడీ

డ్రగ్స్ కేసులో నిందితుడు కెల్విన్ ను ప్రశ్నిస్తున్న ఈడీ
  • కెల్విన్ ఇంట్లో 4 గంటలకుపైగా సోదాలు.. ల్యాప్ టాప్, 2 మొబైల్ ఫోన్లు సీజ్ చేసిన ఈడీ

హైదరాబాద్: తెలుగు సినిమా పరిశ్రమను కుదిపేస్తున్న డ్రగ్స్ కేసులో నిందితుడు కెల్విన్ ను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఇవాళ ఉదయం 6 గంటలకు నిందితుడు కెల్విన్ ఇంటికి వెళ్ళిన సి అర్ పి ఎఫ్ పోలీసులు ఈడి విచారణ కు రావాలని కోరారు. సి అర్ పి ఎఫ్ సిబ్బంది ఇచ్చిన నోటీస్ పై మొదట సంతకం చేసేందుకు నిరాకరించగా కెల్విన్ భార్య జోక్యం చేసుకుని సంతకం చేసి విచారణకు వెళ్లాలని సూచించింది. మరో వైపు సీఆర్పీఎఫ్ తోపాటు ఈడీ అధికారులు కెల్విన్ ఇంట్లో 4 గంటలకుపైగా సోదాలు జరిపారు. కెల్విన్ ల్యాప్ టాప్ తో పాటు కెల్విన్ మొబైల్, కొంత నగదు ను స్వాధీనం చేసుకున్న  ఈడి అధికారులు మధ్యాహ్నం 2 గంటల 10 నిమిషాలకు కెల్విన్ ను ఈడి కార్యాలయానికి తీసుకొచ్చారు. అలాగే మెహదిపట్నం నుండి మరో వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణకు తరలించారు. నిందితులు నటుల మధ్య జరిగిన లావాదేవీల గురించి ప్రశ్నిస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.