సికింద్రాబాద్ రైల్వే స్టేషన్​కు కొత్త హంగులు

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్​కు కొత్త హంగులు
  • రూ.653 కోట్లతో అభివృద్ధికి రైల్వే శాఖ నిర్ణయం 
  • టెండర్లకు దక్షిణ మధ్య రైల్వే ప్రకటన 
  • మెట్రోతో లింక్, కొత్తగా జీ ప్లస్ త్రీ బిల్డింగ్, స్కై కాన్ కోర్స్ 
  • మల్టీ లెవల్ పార్కింగ్,  సిటీ సెంటర్, సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు 

హైదరాబాద్‌‌, వెలుగు: సికింద్రాబాద్‌‌ రైల్వే స్టేషన్‌‌లో అత్యాధునిక సౌలతులు అందుబాటులోకి రానున్నాయి. ఎయిర్‌‌పోర్ట్‌‌ తరహాలో స్టేషన్​ను తీర్చిదిద్దనున్నారు. ఇప్పుడున్న స్టేషన్‌‌ను కొత్త హంగులతో రీడెవలప్‌‌ చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఇందుకోసం రూ.653 కోట్ల అంచనాతో దక్షిణ మధ్య రైల్వే (ఎస్ సీఆర్) శనివారం టెండర్లకు ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 21న ప్రీ బిడ్‌‌ సమావేశం జరగనుండగా, వచ్చే నెల 29న టెండర్ల గడువు ముగియనుంది. మూడేండ్లలో పనులన్నీ పూర్తి చేయాలని ఎస్ సీఆర్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాజెక్ట్‌‌ను ఈపీసీ (ఇంజనీరింగ్‌‌, ప్రొక్యూర్‌‌మెంట్‌‌ అండ్‌‌ కన్​స్ట్రక్షన్‌‌) విధానంలో చేపడుతోంది. దేశంలోని ప్రధానమైన రైల్వే స్టేషన్లలో సికింద్రాబాద్‌‌ ఒకటి. ఈ స్టేషన్‌‌ మీదుగా ప్రతిరోజు 500కు పైగా రైళ్లు వెళ్తుంటాయి. రోజుకు లక్షల మంది ప్రయాణిస్తుంటారు. పది ప్లాట్‌‌ఫామ్‌‌లు ఉన్నాయి. 

రైలు దిగి మెట్రోలో వెళ్లొచ్చు... 

స్టేషన్ లో లిఫ్టులు, ఎస్కలేటర్లు, డిస్‌‌ప్లే సిస్టమ్‌‌ వంటి అత్యాధునిక సౌలతులు కల్పిస్తారు. ప్రయాణికులు వచ్చిపోవడానికి వీలుగా రవాణా సదుపాయాలను మెరుగుపరుస్తారు. సిటీ రోడ్ నెట్ వర్క్ తో పాటు మెట్రోతోనూ అనుసంధానిస్తారు. తూర్పు, పడమర వైపు ఉన్న మెట్రో స్టేషన్లను స్కైవేతో లింక్‌‌ చేస్తూ ఉత్తరాన వాక్‌‌వే ఏర్పాటు చేయనున్నారు. రైలు దిగిన ప్యాసింజర్లు నేరుగా ఎస్కలేటర్ ద్వారా పక్కనే ఉన్న మెట్రో స్టేషన్‌‌‌‌లోకి వెళ్లేలా ఏర్పాట్లు చేస్తా రు. అక్కడి నుంచి ప్రయాణికులు మెట్రో రైలెక్కి తాము వెళ్లాల్సిన ప్రాంతానికి వెళ్లొచ్చు. అలాగే రైల్వే స్టేషన్‌‌‌‌, దాని చుట్టు పక్కల ట్రాఫిక్‌‌‌‌ వ్యవస్థ మెరుగుపరుస్తారు. 

పైన బిల్డింగ్.. కింద ట్రాక్ లు

స్టేషన్‌‌‌‌కు నార్త్‌‌‌‌ సైడ్‌‌‌‌లో కొత్తగా జీ ప్లస్‌‌‌‌ త్రీ బిల్డింగ్‌‌‌‌ నిర్మించనున్నారు. ఇది 22,516 చదరపు మీటర్ల మేర ఉండనుంది. అదే విధంగా సౌత్‌‌‌‌ సైడ్‌‌‌‌లో 14,792 చదరపు మీటర్ల విస్తరణతో బిల్డింగ్‌‌‌‌ను డెవలప్‌‌‌‌ చేయనున్నారు. 108 మీటర్లతో రెండు అంతస్తుల స్కై కాన్ కోర్స్ నిర్మించనున్నారు. ఫస్ట్‌‌‌‌ ఫ్లోర్‌‌‌‌ ప్యాసింజర్లకు అందుబాటులో ఉండనుండగా, సెకండ్‌‌‌‌ ఫ్లోర్ రూఫ్‌‌‌‌ టాప్ ప్లాజాగా అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం రైల్వే ట్రాక్‌‌‌‌ లపై ఎలాంటి నిర్మాణాలు లేవు. అయితే కొత్త ప్లాన్ లో భాగంగా ఇవన్నీ బిల్డింగ్ లోపలికి వచ్చేస్తాయి. అంటే పైన బిల్డింగు ఉంటే, కింద ట్రాక్ లు ఉంటాయి. ఇక ప్లాట్ ఫామ్ లను పూర్తిగా పైకప్పుతో అభివృద్ధి చేయనున్నారు. 

మరెన్నో హంగులు... 

ఎయిర్ పోర్టులోకి వెళ్లగానే లోపలుండే సెటప్ మాదిరి స్టేషన్‌‌‌‌ను రీడెవలప్‌‌‌‌మెంట్‌‌‌‌ చేయనున్నారు. కొత్తగా సిటీ సెంటర్‌‌‌‌ను ఏర్పాటు చేయనున్నారు. ఐదు వేల కేవీపీ సోలార్‌‌‌‌ పవర్‌‌‌‌ ప్లాంట్‌‌‌‌ ఏర్పాటు చేయనున్నారు. ఇక స్టేషన్‌‌‌‌కు నార్త్‌‌‌‌ సైడ్‌‌‌‌ మల్టీ లెవల్‌‌‌‌ (ఐదు లెవల్స్‌‌‌‌) పార్కింగ్‌‌‌‌తో పాటు సౌత్‌‌‌‌ వైపు సెపరేట్‌‌‌‌గా అండర్‌‌‌‌గ్రౌండ్‌‌‌‌ పార్కింగ్‌‌‌‌ ఏర్పాటు చేస్తారు. రెండు వైపులా బిల్డింగ్స్‌‌‌‌ వద్ద ట్రావెలేటర్స్‌‌‌‌తో సహా 2 వాక్‌‌‌‌వేలు నిర్మిస్తారు. స్పెషల్‌‌‌‌గా డ్రాపప్‌‌‌‌ అండ్‌‌‌‌ పికప్‌‌‌‌ ప్లేస్‌‌‌‌లు 
ఏర్పాటు చేయనున్నారు. 

‘‘ప్రైవేట్‌‌‌‌’’ నిర్వహణ రద్దు.. 

ప్రస్తుతం సికింద్రాబాద్‌‌‌‌ స్టేషన్ నిర్వహణను ప్రైవేట్‌‌‌‌ సంస్థకు అప్పగించారు. ఆ సంస్థ స్టేషన్‌‌‌‌ నిర్వహణ, పారిశుధ్య పనులు, వాహనాల పార్కింగ్‌‌‌‌ వ్యవహారాలను చూసుకుంటోంది. దీనిపై వివిధ వర్గాల నుంచి వ్యతిరేకత కూడా వ్యక్తమైంది. ఇప్పుడు రైల్వే మంత్రిత్వ శాఖ స్టేషన్‌‌‌‌ రీడెవలప్‌‌‌‌మెంట్‌‌‌‌కు ముందడుగు వేయడంతో ప్రైవేట్‌‌‌‌ సంస్థ ఒప్పందాన్ని త్వరలో రద్దు చేసుకోనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఆ తర్వాత నిర్వహణ మొత్తం రైల్వే ఆధ్వర్యంలోనే చేపట్టనున్నారు.