![మైనర్ ర్యాష్ డ్రైవింగ్ తో ఇద్దరు మృతి.. వ్యాసం రాయాలంటూ నిందితుడికి కోర్టు షరతు](https://static.v6velugu.com/uploads/2024/05/pune-teen-must-be-tried-as-adult-says-top-cop-amid-outrage-over-bail_R7y2fFrpD3.jpg)
పూణెలో మైనర్ ర్యాష్ డ్రైవింగ్ వల్ల మే 19న ఇద్దరు ప్రాణాలు కోల్పోయిన ఘటనలో నిందితుడికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే కోర్టు ఆ మైనర్ కు విధించిన షరతులు చర్చనీయాంశంగా మారాయి. ప్రమాదాలపై వ్యాసం రాయాలని.. ఎరవాడ ట్రాఫిక్ పోలీసులతో 15 రోజులు పనిచేయాలని.. మద్యపానం మానేయడానికి సైకాలజిస్ట్ ను సంప్రదించాలని మైనర్ కు సూచించింది. నిందితుడిని మేజర్ గా పరిగణించాలని పోలీసులు కోరగా..కోర్టు అందుకు తిరస్కరిస్తూ అతనికి బెయిల్ మంజూరు చేసింది.
పూణెలో మే 19న తెల్లవారుజామున 2.15 గంటలకు హై స్పీడ్ వచ్చిన ఓ లగ్జీరీ కారు కళ్యాణీ జంక్షన్ దగ్గర ఓ బైక్ ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు కారు నడుపుతున్న వ్యక్తిని మైనర్ గా గుర్తించారు. ఓ క్లబ్ లో స్నేహితులతో కలిసి మద్యం పార్టీ చేసుకుని తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగిందని పూణె సిటీ డీసీపీ విజయ్ కుమార్ వెల్లడించారు. అతడిపై ఎరవాడ పీఎస్ లో ర్యాష్ డ్రైవింగ్, నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు తీశాడని..మోటారు వాహనాల చట్టంలోని నిబంధనలతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అతడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. అయితే నిందితుడిని మేజర్ గా పరిగణించలేమన్న కోర్టు.. మైనర్ కు షరతులతో బెయిల్ మంజూరు చేసింది.