హైదరాబాద్లో ప్రసిద్ధి చెందిన బత్తిని కుటుంబ సభ్యుల చేప ప్రసాదం పంపిణీకి సర్వం సిద్ధమైంది. ప్రతి సంవత్సరం మృగశిర కార్తె సందర్భంగా దేశ, విదేశాల నుండి వచ్చే లక్షలాది మంది ఆస్తమా బాధితులకు ఈ ప్రసాదాన్ని పంపిణీ చేస్తుంటారు. జూన్ 8వ తేదీ సోమవారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఈ కార్యక్రమం జరగనుంది.
ఈ క్రమంలో.. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరుగుతున్న ముందస్తు ఏర్పాట్లను హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, మత్స్య, పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, హైదరాబాద్ కలెక్టర్ ప్రియాంక, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ స్వయంగా పరిశీలించారు.
ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఒకేసారి దాదాపు 60 వేల మంది చేప ప్రసాదం తీసుకునేలా విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల నుండి, విదేశాల నుండి లక్షలాది మంది ఆస్తమా బాధితులు తరలివచ్చే అవకాశం ఉండడంతో అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయగా.. అత్యవసర సేవల కోసం అంబులెన్సులు, అవసరమైన మందులు, సీపీఆర్ శిక్షణ పొందిన వైద్య సిబ్బంది మరియు వలంటీర్లను అందుబాటులో ఉంచారు.
1847లో బత్తిని వీరన్న గౌడ్ ప్రారంభించిన ఈ చేప ప్రసాద పంపిణీ.. ఎటువంటి ఆటంకాలు లేకుండా సుదీర్ఘంగా, ఏకంగా 179 ఏండ్లుగా నిరంతరాయంగా కొనసాగుతుండడం విశేషం.
