
- ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య
నల్గొండ అర్బన్, వెలుగు : నీతి, నిజాయితీకి మారుపేరుగా గొల్లకురుమలు నిలుస్తారని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యయాదవ్ అన్నారు. ఆదివారం నల్గొండలోని యాదవ భవనంలో నూతనంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో నియమితులైన యాదవ ఉద్యోగుల ఆత్మీయ అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ సత్యం, ఆర్టీసీ మాజీ ప్రధాన కమిషనర్ డాక్టర్ వర్రే వెంకటేశ్వర్లుతో కలిసి బీర్ల ఐలయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాదవ ఉద్యోగులు అంకితభావంతో పనిచేసి వృత్తి గౌరవాన్ని కాపాడాలని కోరారు. నేటి పోటీ ప్రపంచంలో ఉద్యోగాలు పొందాలంటే చాలా కష్టపడాలని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా గొల్లకురుమల సమస్యల సాధనకు కృషి చేస్తానని తెలిపారు.
గొల్లకురుమలకు ప్రత్యేక కార్పొరేషన్, ఎక్కువ నిధులు కేటాయించేందుకు ప్రభుత్వపరంగా కృషి చేస్తానన్నారు. ఎమ్మెల్సీ సత్యం మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఉద్యోగులు పనిచేయాలని సూచించారు. గొల్లకురుమల ఉద్యోగులకు అండగా ఉంటానని తెలిపారు. సభలో మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, గొర్రెలు, మేకల కార్పొరేషన్ మాజీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజుయాదవ్, బీజేపీ రాష్ట్ర నాయకుడు రామరాజుయాదవ్, అఖిల భారత యాదవ సంఘం అధ్యక్షుడు గోవర్ధన్ యాదవ్, యాదవ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పరమేశ్ యాదవ్, అశోక్ యాదవ్, సంఘం సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.