మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ లో బాలికపై లైంగిక వేధింపుల కేసు విచారణ తొలిరోజు ముగిసింది. 7 గంటల పాటు చైల్డ్ ప్రొటెక్షన్, షీటీమ్ అధికారులు విచారణ జరిపారు. మేడ్చల్ ఆర్టీఓ సమక్షంలో ఈ విచారణ కొనసాగింది. విచారణ తర్వాత వెళ్లిపోతున్న హరికృష్ణ కారును స్టూడెంట్స్ అడ్డుకున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓఎస్డీ హరికృష్ణ సహా విద్యార్ధుల స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. అమ్మాయిలను ఒక్కొక్కరిగా పిలిచి ఆరా తీసి.. రాతపూర్వకంగా స్టేట్ మెంట్ తీసుకున్నారు. అలాగే గర్ల్స్ హాస్టల్లో బాలికలు, స్టాఫ్, కోచ్లను అధికారులు విచారించారు. నివేదికను జిల్లా కలెక్టర్కు చైల్డ్ రైట్స్ కమిటీ సభ్యులు సమర్పించనున్నారు.
హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ ఓఎస్డీ హరికృష్ణపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. దీంతో హరికృష్ణపై రాష్ట్ర ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. బాలికలపై ఓఎస్డీ హరికృష్ణ లైంగిక వేధింపులకు పాల్పుడుతున్నాడని మీడియాలో కథనాలు వచ్చాయి. దీంతో రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష తర్వాత లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓఎస్డీ హరికృష్ణను సస్పెండ్ చేశారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలను హరికృష్ణ ఖండించారు. ఈ ఆరోపణలపై సమగ్రంగా విచారణ జరిపించాలని హరికృష్ణ కోరారు.
మరోవైపు హరికృష్ణపై ఆరోపణలు రావడంతో ఆయన స్థానంలో సుధాకర్ ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. మేడ్చల్ జిల్లా యువజన అధికారిగా సుధాకర్ పనిచేశారు. అయితే స్పోర్ట్స్ స్కూల్ పరిణామాలపై తాను వ్యాఖ్యానించబోనని చెప్పారు. విద్యార్థుల్లో మనోధైర్యం నెలకొల్పే ప్రయత్నం చేస్తానన్నారు.