
- వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ
నల్గొండ అర్బన్, వెలుగు : గ్రామీణ ప్రజలకు ప్రైవేట్ హాస్పిటల్స్ యాజమాన్యాలు నాణ్యమైన వైద్యం అందించాలని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సూచించారు. ఆదివారం నల్గొండలోని దేవరకొండ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ ప్రైవేట్ హాస్పిటల్ ను మాజీ మంత్రి కె.జానారెడ్డి తో కలిసి జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వైద్యరంగానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ దశలవారీగా అమలు చేస్తుందని తెలిపారు.
ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాలు ప్రజల మన్ననలు పొందే విధంగా పనిచేసి జిల్లాకు మంచి పేరు తేవాలని సూచించారు. ఎస్సీ వర్గీకరణ తర్వాత జిల్లాకు తొలిసారి వచ్చిన మంత్రి దామోదర రాజనర్సింహను ఎమ్మార్పీఎస్ నాయకులు కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు శంకర్ నాయక్, సత్యం, కాంగ్రెస్ నాయకులు గుమ్మల మోహన్ రెడ్డి, పాశం రాంరెడ్డి, కొండేటి మల్లయ్య, ఎమ్మార్పీఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.