- తేల్చి చెప్పిన హైకోర్టు
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ కర్మన్ఘాట్లోని శ్రీబన్సూరి కృష్ణ మందిరానికి చెందిన కోట్ల విలువ చేసే 2.34 ఎకరాల స్థలంలోని ఆక్రమణల తొలగింపు వ్యవహారంపై స్టే ఇవ్వలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. ఇవి సొంత భూములని చెప్పడానికి పిటిషనర్ల వద్ద సరైన ఆధారాలు లేవని, ఇందులో జోక్యం చేసుకోలేమని తెలిపింది. సైదాబాద్లో సర్వే నం.110లో దేవాలయ భూముల వ్యవహారంలో ఆక్రమణలను ధ్రువీకరిస్తూ వాటిని ఖాళీ చేయాలంటూ ఎండోమెంట్ ట్రైబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఎం.వెంకటేశ్ తో పాటు మరో 12 మంది వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు మంగళవారం విచారణ చేపట్టారు.
పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఇక్కడ తాము ఇంటి స్థలాలను కొనుగోలు చేశామని, వాటికి సంబంధించిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు కూడా ఉన్నాయన్నారు. భూమి యజమాని 1992లో ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ తీసుకున్నారని, వాటన్నింటినీ పరిశీలించి అధికారుల నుంచి ఎన్వోసీ తీసుకున్నాక కొనుగోలు చేశామన్నారు. విద్యుత్తు కనెక్షన్తోపాటు ఇంటి పన్నును కూడా చెల్లిస్తున్నామన్నారు. వాస్తవాలను పరిగణనలోకి తీసుకోకుండా దేవాదాయశాఖ ట్రైబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వుల అమలుపై స్టే ఇవ్వాలని కోరారు.
ప్రభుత్వం తరఫున న్యాయవాదులు హెరూర్ రాజేశ్కుమార్, భూక్యా మంగీలాల్ నాయక్, సతీశ్కుమార్ వాదనలు వినిపిస్తూ.. ఆలయ మాన్యాన్ని ఆక్రమించుకుని ప్లాట్లు చేసుకున్నారన్నారు. దీనిపై ఎండోమెంట్ ట్రైబ్యునల్ ఇటీవల తీర్పు వెలువరిస్తూ పిటిషనర్లు ఆక్రమణలకు పాల్పడినట్టు ధ్రువీకరించడంతో ఆక్రమణలను తొలగించామన్నారు. వాదనలను విన్న జడ్జి.. ఆక్రమణల తొలగింపుపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరిస్తూ పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని దేవాదాయశాఖకు నోటీసులు జారీచేశారు.
