
ఎక్కువ పని చేయడం, ఎండలో బయట తిరగడం,మానసిక ఒత్తిడి ఇలా అనేక కారణాలు చర్మంపై ప్రభావం చూపుతాయి. అలాగే గాడ్జెట్ల వాడకం పెరగడంతో వాటి నుంచి వచ్చే టెంపరేచర్, బ్లూ లైట్ చర్మం మీద నెగెటివ్గా పని చేస్తాయి. వీటన్నిటి నుంచి చర్మాన్ని కాపాడుకోవాలంటే నీళ్లు ఎక్కువగా తాగాలి. పండ్లు, కూరగాయలు, హెల్దీ కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లను తీసుకోవాలి. డైలీ స్కిన్ కేర్ రొటీన్స్ ఉండాలి. ఫేస్ వాష్, మాయిశ్చరైజర్ వంటివి వాడాలి. షేవింగ్ తర్వాత ఆఫ్టర్ షేవ్ క్రీమ్స్ వాడటం తప్పనిసరి. మాయిశ్చరైజర్ స్కిన్ను తడిగా ఉంచుతుంది. డ్రై స్కిన్ను తగ్గించి ముడతలు రాకుండా అడ్డుపడుతుంది. స్కిన్ కేర్ విషయంలో తినే తిండి చాలా ఇంపార్టెంట్. ఒక్కమాటలో చెప్పాలంటే... ప్లేట్లో ఎక్కువ పండ్లు, కూరగాయలు ఉండాలి. చక్కెర, ఉప్పును తగ్గించాలి. హెవీ ప్రాసెస్డ్ ఫుడ్ను మానేస్తే మరీ మంచిది. అవిసె గింజలు, కివి, అవకాడో, బచ్చలికూర, పెరుగు చర్మాన్ని కాంతివంతంగా చేస్తాయి. శరీరాన్ని డిటాక్స్ చేయడానికి గ్రీన్ టీ లేదా హెర్బల్ టీ తాగవచ్చు. కొందరికి గుడ్లు, చికెన్ తింటే కూడా స్కిన్ మీద ఎఫెక్ట్ పడుతుంది. మొటిమలు వస్తే మంచి ఫేస్ వాష్ వాడి క్లీన్ చేయాలి. సాలిసిలిక్ యాసిడ్, బెంజాయిల్ పెరాక్సైడ్ లేదా గ్లైకోలిక్ యాసిడ్ ఉన్న సబ్బులు లేదా ఫేస్ వాష్లు వాడితే ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడొచ్చు. ఫేస్ మాస్క్లు చర్మాన్ని హైడ్రేట్ చేసి, జిడ్డును తొలగిస్తాయి. మచ్చలు, డార్క్ స్పాట్స్ ఉంటే తేనె ఫేస్ మాస్క్లు బాగా పని చేస్తాయి. తేనె ఫేస్ మాస్క్ తయారు చేయడం కూడా చాలా ఈజీ. రెండు టీస్పూన్ల పచ్చితేనె, అర టీస్పూన్ నిమ్మరసం ఉంటే చాలు. ఈ రెండింటినీ కలిపి ముఖానికి అప్లై చేయాలి. 20 నుండి 30 నిమిషాలు ఇలాగే ఉంచుకుని తరువాత శుభ్రంగా కడగాలి. ఈ మాస్క్ తరచూ వేసుకుంటే మచ్చలు తగ్గి స్కిన్ మెరుస్తుంది.