- చెక్డ్యాముల డిజైన్లలో లోపాలు!
- డిజైన్ల లోపంపై ముందే హెచ్చరించిన రిటైర్డ్ ఇంజనీర్లు
- పదేండ్లు కూడా పనిచేయవని చెప్పినా వినని సర్కారు
- కడుతున్నప్పుడే బట్టబయలవుతున్న లోపాలు
- కాంట్రాక్టర్ల జేబులు నింపేందుకేనని ఆరోపణలు
- రూ.2,500 కోట్లు వాగుల పాలు
హైదరాబాద్, వెలుగు: వాగులోపారే నీటిని ఒడిసి పట్టేందుకే చెక్డ్యామ్లు కడుతున్నామని సర్కారు చెప్తున్నా.. కాంట్రాక్టర్ల జేబులు నింపడమే దాని వెనుక ఎజెండాగా తెలుస్తోంది. టీఆర్ ఎస్ నాయకులు, ప్రభుత్వంలో కీలక వ్యక్తులకే వీటిని అప్పగించడం, చేసిన పనులు మొదటి వరదలకే కొట్టుకుపోవడం చూస్తుంటే అది నిజమే అనిపిస్తోంది. ఈ చెక్డ్యామ్లకు డిజైన్లే ప్రధాన లోపమని, పదేండ్లకు మించి అవి పనిచేయవని రిటైర్డ్ ఇంజనీర్లు హెచ్చరించినా సర్కారు పట్టించుకోలేదు. సక్సెస్ ఫుల్ డిజైన్లను పంపి అట్ల కడితెనే ప్రయోజనమని చెప్పినా లెక్క చేయలేదు. దీంతో రూ.2,500 కోట్లకు పైగా ప్రజాధనం వాగుల పాలవుతున్నాయి. కడుతున్నప్పుడే అనేక చెక్డ్యామ్లు జాడ లేకుండా కొట్టుకపోతున్నాయి.
సీఈసీడీవో ఇచ్చిన డైజన్స్ తో
రాష్ట్ర సర్కార్ కృష్ణా, గోదావరి బేసిన్లోని ఉప నదులు, వాగులపై పెద్ద ఎత్తున చెక్డ్యామ్లు కట్టి భూగర్భ జలాలు పెంచాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే సీనియర్ ఇంజనీర్ల బృందాన్ని మహారాష్ట్రకు పంపి అక్కడి చెక్ డ్యాంలపై స్టడీ చేయించింది. మహారాష్ట్రలోని కొల్హాపూరి టైప్ వియర్స్ (కేటీ వియర్స్) చెక్డ్యామ్ లు పరిశీలించి ఇంజనీర్లు రిపోర్ట్ ఇచ్చారు. వర్షపాతం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోనే ఆ తరహా చెక్డ్యామ్ లు విజయవంతమవుతాయని, తెలంగాణకు ఆ మోడల్ సూటబుల్ కాదని సూచించారు. కేటీ వియర్స్ తరహాలో వేల చెక్ డ్యామ్లు నిర్మిస్తే వర్షపాతం తక్కువగా ఉండే విదర్భ, మరాఠ్వాడ ప్రాంతాల్లో అవి ఫలితాలు ఇవ్వలేదని తెలిపారు. వాటికి పెట్టిన గేట్ల నిర్వహణలో కూడా సమస్యలు ఉన్నట్లు తెలిపారు. దీంతో రాష్ట్రంలో కట్టాలనుకుంటున్న 1,200 చెక్డ్యామ్లు కోసం డిజైన్స్ రూపొందించాలని ఇరిగేషన్ శాఖ పరిధిలోని సీఈ సీడీవోను ప్రభుత్వం ఆదేశించింది. రాళ్ల నేల, గట్టి మొరం నేలపై, ఇసుక నేలపై ఎలాంటి చెక్డ్యామ్లు నిర్మించవచ్చో సీఈసీడీవో చీఫ్ ఇంజనీర్ ఆధ్వర్యంలో ఇంజనీర్ల టీమ్ సర్కార్కు డ్రాయింగ్స్ అందించింది. వాటి ఆధారంగా చెక్డ్యామ్ల నిర్మాణం ప్రారంభించారు. మొదటి విడతలో 650 చెక్ డ్యామ్ల నిర్మాణానికి రూ.2,847.71 కోట్లతో పరిపాలన అనుమతి ఇచ్చింది.
పగుళ్లు వస్తాయాన్న వినలేదు
వాగు ప్రవాహం కంటే ఎక్కువ ఎత్తుతో అడ్డంగా నిర్మిస్తున్న చెక్డ్యామ్లు పదేండ్లకు మించి పనిచేయవని, పూడిక నిండడంతో పాటు చెక్డ్యామ్, రీటైనింగ్ వాల్లకు జల్దీ పగుళ్లొస్తాయని రిటైర్డ్ ఇంజనీర్లు సూచించారు. రూ.2,847.71 కోట్లతో చేపడుతున్న ఈ చెక్ డ్యామ్లను ‘సదర్మాట్ ఆనికట్’, ‘నిమ్మల చెక్ డ్యామ్’ మోడల్లో చేపడితే రూ.1,200ల కోట్ల వరకు ఖర్చు తగ్గించవచ్చని సూచించినా ఇరిగేషన్ శాఖ పెడచెవిన పెట్టింది. స్వర్ణ నదిపై బీరవెల్లి చెక్ డ్యామ్ను రూ.3.95 కోట్లతో ప్రతిపాదించారని, అదే చెక్ డ్యామ్ను నిమ్మల చెక్ డ్యామ్ మోడల్లో చేపడితే రూ.2.11 కోట్లతోనే కట్టొచ్చని డిజైన్లను సమర్పించారు. ఆ ప్రపోజల్ను ప్రభుత్వం కనీసం పరిగణలోకి తీసుకోలేదు. నిజాం హయాంలో కట్టిన సదర్మాట్ ఆనికట్ 125 ఏండ్లుగా సక్సెస్పూల్గా పనిచేస్తుందని తెలిపారు. ఇది మినహా మిగతా చెక్డ్యామ్లు ఆనవాళ్లు కోల్పోయాయని, కొత్తగా నిర్మించే చెక్డ్యామ్ల పరిస్థితి ఇలాగే ఉంటుందని తెలిపారు. నిమ్మల తరహా చెక్డ్యామ్కు లోతైన ఫౌండేషన్ అవసరం లేదని, దీంతో ఖర్చు తగ్గుతదని పేర్కొన్నారు. చెక్డ్యామ్కు పెట్టే గేట్లను వరద రోజుల్లో తీసి ఉంచితే పూడిక రాదని తెలిపారు. గేట్లను ఇద్దరు సిబ్బందితో సులువుగా ఆపరేట్ చేయవచ్చని చెప్పారు. గేట్ల నుంచి నీళ్లు లీక్ అయ్యే చాన్స్ లేదని తెలిపారు.
లోపాలపై చెప్పిన వినలేదు
రిటైర్డ్ ఇంజనీర్లు చెక్డ్యామ్ల డిజైన్లు, డ్రాయింగ్స్లో లోపాలను లేవనెత్తినా వాటిని ప్రభుత్వం లెక్కలోకి తీసుకోకపోవడంతో నిర్మాణ దశలోనే అనేక చెక్డ్యామ్లు కొట్టుకుపోతున్నాయి. వాటికి పెట్టిన ఖర్చంతా వృథా అవుతోంది. నిర్మల్ జిల్లాలో 2017లో నిర్మించిన సకేరా చెక్డ్యామ్ లో కొద్ది రోజుల్లోనే అనేక సమస్యలు తలెత్తాయని తెలిపారు. దీన్ని ఉదాహరణగా తీసుకొని అయినా కొత్త చెక్డ్యాంలు వాగుకు అడ్డంగా ప్రవాహం కన్నా ఎత్తుతో నిర్మించవద్దని సూచించారు. అయినా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏమాత్రం పట్టించుకోలేదు. దీని వెనుక ప్రభుత్వ పెద్దల ఒత్తిడి ఉన్నట్టుగా ఆరోపణలు ఉన్నాయి. డిపార్ట్మెంట్పై గుత్తాధిపత్యం చెలాయిస్తున్న కీలక అధికారికి సన్నిహిత కాంట్రాక్టరే ఎక్కువ చెక్డ్యామ్ లు కడుతున్నాడని, ఆయనకు లాభం చేకూర్చడానికే తక్కువ ఖర్చుతో సక్సెస్ ఫుల్ గా ఉండే డిజైన్లను పరిగణలోకి తీసుకోలేదని సమాచారం. చెక్డ్యామ్ల నిర్మాణంలో ప్రభుత్వ నిర్లక్ష్యంపై న్యాయపోరాటం చేస్తామని సీనియర్ ఇంజనీర్ ఒకరు వెల్లడించారు.
సదర్మాట్ ఆనికట్.. నిమ్మల చెక్ డ్యామ్ లను మోడల్గా తీసుకొని చెక్డ్యామ్లు కట్టాలని సూచించా.. ఇరిగేషన్ ఈఎన్సీకి ఎన్నోసార్లు లెటర్లు రాశా.. దేశంలో ఎన్నో చెక్ డ్యామ్లను స్టడీ చేసి వాటిలో సక్సెస్ఫుల్ డిజైన్స్, డ్రాయింగ్స్ సజెస్ట్ చేశా.. నా డిజైన్ ప్రకారం చెక్ డ్యామ్ నిర్మిస్తే ఒక్కోదానికి ఖర్చు కోటి రూపాయలకుపైగా తగ్గుతుందని చెప్పినా పట్టించుకోలే.. నేను ఇచ్చిన డిజైన్ను, సీడీవో డిజైన్లపై రాజేంద్రనగర్లోని తెలంగాణ స్టేట్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ల్యాబ్స్తో మోడల్ స్టడీ చేయించాలని కోరిన. మోడల్ స్టడీలో నా డిజైన్ ఫెయిల్ అయితే అందుకు అయ్యే ఖర్చు మొత్తం భరిస్తానని చెప్పినా.. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఒప్పుకోలే.. ప్రజల సొమ్ము వేల కోట్ల రూపాయలు వాగుల్లో పోసి కాంట్రాక్టర్లకు దోచిపెడుతున్నరు’’ - ఓ ఇరిగేషన్ రిటైర్డ్ ఇంజనీర్ ఆవేదన
ఒక్కదానికీ ఫీజిబులిటీ రిపోర్టు లేదు
రాష్ట్రంలో 600లకు పైగా చెక్డ్యామ్లు నిర్మిస్తున్నా వాటిలో ఒక్కదానికీ ఫీజిబులిటీ రిపోర్టు తయారు చేయలేదు. నవంబర్, డిసెంబర్, జనవరి నెలల్లో నీళ్లు పారే వాగుల్లో చెక్డ్యామ్లు కడితేనే అవి సక్సెస్ అవుతాయి. సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల్లో పారే కూడవెల్లి వాగులోకి ఆయకట్టు నుంచి పడుబాటు నీళ్లు కూడా రావు. అక్కడ కట్టిన చెక్డ్యామ్లన్నీ పూడికతో నిండిపోయాయి. క్యాచ్మెంట్లో 75 శాతం డిపెండబులిటీ ఈల్డ్లో 20 శాతం (రీచార్జ్ వాటర్ కలిపి) చెక్డ్యామ్ల ఆయకట్టుకు డిజైన్ చేసుకోవాలి. కానీ మన దగ్గర ఇష్టం వచ్చినట్టుగా చెక్డ్యామ్లు నిర్మించారు. వాటిలో పూడిక పేరుకుపోకుండా కనీసం రివర్ స్లూయిజ్లు కూడా ఏర్పాటు చేయలేదు. ఇప్పటికే అనేక చెక్డ్యామ్లలో పగుళ్లు ఏర్పడ్డాయి. మిగతావి కొంతకాలానికే పూడికతో నిండి ఎందుకూ పనికిరాకుండా పోతాయి. ప్రభుత్వం మాస్ లెవల్లో నిర్మాణాలపై దృష్టి పెట్టిందే తప్ప డిజైన్స్, డ్రాయింగ్స్ విషయంలో ఏమాత్రం శ్రద్ధ పెట్టలేదు. – పాత వెంకటరమణ, రిటైర్డ్ ఇంజనీర్, మాజీ డీడీ, జీఆర్ఎంబీ