
- మిడిల్ ఈస్ట్ నుంచి తగ్గనున్న దిగుమతులు
- ఆల్టర్నేటివ్గా మారనున్న రష్యా, యూఎస్
- జూన్లో రష్యా నుంచి 22 లక్షల బీపీడీ కొనుగోళ్లు
- ఇరాక్, సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్ నుంచి కొంటున్న మొత్తం ఆయిల్ కంటే ఎక్కువ
- అమెరికా నుంచి 40 శాతం పెరిగిన క్రూడాయిల్
న్యూఢిల్లీ: క్రూడాయిల్ రవాణాలో కీలకమైన హర్మూజ్ జల సంధిని ఇరాన్ క్లోజ్ చేస్తామని ప్రకటించడంతో, రష్యా, అమెరికా నుంచి ఆయిల్ దిగుమతులను ఇండియా పెంచే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఈ దేశాల నుంచి ఆయిల్ కొనుగోళ్లు భారీగా పెంచింది. ఇండియా క్రూడాయిల్ దిగుమతుల్లో 40శాతం, గ్యాస్లో సగం హర్మూజ్ ద్వారా జరుగుతోంది. ఇరాన్ ఈ మార్గాన్ని మూసేస్తే మన ఆయిల్ దిగుమతులకు అంతరాయం ఏర్పడుతుంది. చైనా కూడా ఇబ్బంది పడుతుంది. ఈ దేశ ఆయిల్ దిగుమతుల్లో 47 శాతం మిడిల్ ఈస్ట్ నుంచి వస్తోంది. మరోవైపు ఇండియా తన దిగుమతి స్ట్రాటజీని గత రెండేళ్లలో బాగా మార్చింది. రష్యన్ ఆయిల్ (ఉరల్స్, ఈఎస్పీఓ, సోకోల్) ను హర్మూజ్కు సంబంధం లేకుండా సూయెజ్ కెనాల్, కేప్ ఆఫ్ గుడ్ హోప్, పసిఫిక్ సముద్రం ద్వారా దిగుమతి చేసుకుంటోంది. అమెరికా, వెస్ట్ ఆఫ్రికా, లాటిన్ అమెరికా నుంచి దిగుమతుల ఖర్చు పెరిగినా, వీటిని బ్యాకప్ ఆప్షన్స్గా ఉపయోగిస్తోంది.
“జూన్లో రష్యా, అమెరికా నుంచి వచ్చిన క్రూడాయిల్ను చూస్తే ఇండియా కేవలం మిడిల్ ఈస్ట్పైనే ఎక్కువగా ఆధారపడడం లేదని అర్థమవుతుంది. హర్మూజ్ ద్వారా రవాణా ఆగితే , రష్యన్ బ్యారెల్స్ దిగుమతులను ఇండియా బాగా పెంచుకుంటుంది. ఖర్చులు పెరిగినా, అమెరికా, నైజీరియా, అంగోలా, బ్రెజిల్ నుంచి కూడా ఆయిల్ దిగుమతులు పెంచొచ్చు” అని కెప్లర్ రీసెర్చ్ ఎనలిస్ట్ సుమిత్ రిటోలియా వివరించారు. ఇండియా స్ట్రాటజిక్ రిజర్వ్స్ (9–-10 రోజుల దిగుమతి అవసరాలను కవర్ చేసే) ను కూడా ఉపయోగించొచ్చన్నారు. డొమెస్టిక్ ధరలు (ముఖ్యంగా డీజిల్, ఎల్పీజీ) పెరిగితే, ప్రభుత్వం ధరల సబ్సిడీలు ఇచ్చి ఇన్ఫ్లేషన్ను అదుపు చేయొచ్చు.
“ మిడిల్ ఈస్ట్ క్రూడ్, ఎల్పీజీ అత్యవసరమే అయినా, ఈ సప్లయ్లో అంతరాయం ఏర్పిడితే ఇండియన్ రిఫైనరీ కంపెనీలు సమస్యలను తట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. బ్యాకప్గా రష్యా, అమెరికా నుంచి ఆయిల్ దిగుమతులు పెంచుకోవచ్చు” అని సుమిత్ చెప్పారు. ఈ నెల 1-–19 మధ్య భారత్ 21–-22 లక్షల బీపీడీల రష్యన్ క్రూడ్ దిగుమతి చేసుకుంది. మొత్తం ఆయిల్ దిగుమతుల్లో రష్యా వాటా 35 శాతానికి పైగా ఉంది. మిడిల్ ఈస్ట్ నుంచి 19 లక్షల బీపీడీ దిగుమతి అయింది. పూర్తి నెలకు ఈ నెంబర్ 20 లక్షల బీపీడీని దాటొచ్చు. మే నెలలో దిగుమతి చేసుకున్న దాని కంటే సుమారు 1.50 లక్షల బీపీడీ తక్కువ.
రష్యా నుంచి పెరిగిన ఆయిల్
ఇజ్రాయెల్, -ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవడంతో ఇండియా రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ దిగుమతులను గణనీయంగా పెంచింది. ఇది సౌదీ అరేబియా, ఇరాక్ వంటి మిడిల్ ఈస్ట్ సప్లయర్ల నుంచి కొంటున్న మొత్తం కంటే ఎక్కువ. గ్లోబల్ ట్రేడ్ ఎనలిటిక్స్ కంపెనీ కెప్లర్ డేటా ప్రకారం, జూన్లో భారత రిఫైనరీలు 22 లక్షల బ్యారెల్స్ పర్ డే (బీపీడీ) రష్యన్ క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసున్నాయని అంచనా. ఇది గత రెండేళ్లలో అత్యధికం. ఇరాక్, సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్ నుంచి వచ్చిన మొత్తం కంటే ఎక్కువ. మేలో రష్యా నుంచి 19.6 లక్షల బీపీడీ దిగుమతి అయింది. అమెరికా నుంచి దిగుమతులు 2,80,000 బీపీడీ నుంచి 40 శాతం పెరిగి జూన్లో 4,39,000 బీపీడీకి చేరాయి.
51 లక్షల బీపీడీ దిగుమతి
ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆయిల్ దిగుమతి, వినియోగ దేశమైన ఇండియా 51 లక్షల బ్యారెల్స్ పర్ డే (బీపీడీ) క్రూడ్ ఆయిల్ను దిగుమతి చేసుకుంటోంది. దీనిని రిఫైనరీల్లో పెట్రోల్, డీజిల్గా మారుస్తారు. సాంప్రదాయకంగా మిడిల్ ఈస్ట్ నుంచి ఆయిల్ దిగుమతి చేసే ఇండియా, 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్పై రష్యా దాడి తర్వాత రష్యన్ ఆయిల్ను పెద్ద ఎత్తున కొనుగోలు చేయడం మొదలుపెట్టింది. అంతకు ముందు ఇండియా ఆయిల్ దిగుమతుల్లో రష్యా వాటా ఒక శాతం ఉండగా, 2024–25 లో సుమారు 40 శాతానికి చేరుకుంది. కెప్లర్ ఎనలిస్ట్ సుమిత్ మాట్లాడుతూ, “మిడిల్ ఈస్ట్ నుంచి క్రూడ్ ఆయిల్ దిగుమతులు రాబోయే రోజుల్లో తగ్గొచ్చు. షిప్ఓనర్లు ఖాళీ ట్యాంకర్లను గల్ఫ్కు పంపడానికి సంకోచిస్తున్నారు. మిడిల్ ఈస్ట్కు వెళ్లే వెసెల్స్ సంఖ్య 69 నుంచి 40కి పడిపోయింది” అని అన్నారు. దీనివల్ల మిడిల్ ఈస్ట్, గల్ఫ్ సప్లయ్లు పడిపోవచ్చని అంచనా వేశారు.