
- స్టూడెంట్లకు డిజిటల్ విద్యనందించాలి: కేంద్ర మంత్రి జయంత్ చౌదరి
హైదరాబాద్/ముషీరాబాద్, వెలుగు: ఐటీకి తెలంగాణ కేరాఫ్ అడ్రస్గా నిలుస్తున్నదని కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి అన్నారు. గవర్నమెంట్ స్కూల్స్లోని టీచర్లంతా టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని సూచించారు. స్టూడెంట్లకు సాంకేతిక విద్యను దగ్గర చేయాలన్నారు. మిషన్ మోడ్తో విద్యా సంస్థలన్నీ పని చేయాలని తెలిపారు. హైదరాబాద్లోని ఎస్సీఈఆర్టీని జయంత్ చౌదరి ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ను పరిశీలించారు. రాష్ట్రంలో జరిగిన టీచర్ ట్రైనింగ్, పీఎంశ్రీ స్కూళ్లు, కేజీబీవీలు, విద్యార్థుల క్లాస్రూమ్లు, బడిబాట, సమ్మర్ క్యాంపుల కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలను చూశారు.
అనంతరం హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్ డైట్ కాలేజీల ప్రిన్సిపాల్స్తో సమావేశమయ్యారు. డైట్స్ నిర్వహించే కార్యక్రమాలు, వాటి భవిష్యత్ ప్రణాళికల గురించి అడిగి తెలుసుకున్నారు. డైట్స్, ఎస్సీఈఆర్టీ నిర్వహించే పరిశోధనలు, అధ్యయనాలను తప్పనిసరిగా క్షేత్ర స్థాయిలో అమలు చేయాలని మంత్రి జయంత్ చౌదరి సూచించారు. తర్వాత విద్యార్థులతో నేరుగా మాట్లాడి, వారు నేర్చుకుంటున్న తీరు గురించి ఆరా తీశారు. దీర్ఘ, స్వల్ప కాలిక లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధనకు అవసరమైన వ్యూహాలను అమలు చేయాలన్నారు.
స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ మాట్లాడుతూ.. విద్యకు రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రాధాన్యత ఇస్తున్నదని, దానిలో భాగంగానే ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్తో పాటు కొత్త టీచర్ల నియామకం జరిగిందని తెలిపారు. టీచర్లకు వేసవిలో ట్రైనింగ్ ఇచ్చామని గుర్తుచేశారు. సమావేశంలో ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రమేశ్, సమగ్ర శిక్ష జాయింట్ డైరెక్టర్ రాజీవ్ తదిరతులు పాల్గొన్నారు.
తెలంగాణలో లోక్ దళ్ పార్టీని బలోపేతం చేయాలి
తెలంగాణలో సామాజిక న్యాయం సాధించాల్సిన అవసరం ఉందని కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి, రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ జాతీయ అధ్యక్షుడు జయంత్ చౌదరి అభిప్రాయపడ్డారు. రైతులు, యువత సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా పోరాటం చేయడం ద్వారా పార్టీని పటిష్టం చేయాలని సూచించారు. రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ రాష్ట్ర కార్యాలయ ప్రారంభోత్సవం ఆదివారం కవాడిగూడ అన్నం కాంప్లెక్స్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ క్రియాశీలక పాత్ర పోషించిందని గుర్తు చేశారు. ప్రత్యేక రాష్ట్రంలో పార్టీని మరింత పటిష్టం చేయాలని, ఇందుకోసం ప్రజలకు మద్దతుగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
రాష్ట్రీయ లోక్ దళ్ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పార్టీ పని చేస్తుందని చెప్పారు. త్వరలోనే సంస్థాగత నియామకాలు చేపట్టి ప్రజా సమస్యలపై ఆందోళనలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా విభాగం జాతీయ అధ్యక్షురాలు కె.ఇందిర, కార్యనిర్వహక అధ్యక్షుడు కిన్నెర సిద్ధార్థ్, గిరి కుండే, విశాల్ వంజరి, మల్లేష్ గౌడ్, రుషబ్ జైన్, ఓంకార్ గౌడ్, మడకం ప్రసాద్, నూనె భాస్కర్ రావు, నరసింహ రావు, కోరే సాయిరాం పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు.